నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తనపై యాసిడ్ దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదంతా కట్టుకథగా తేల్చారు. ఒక విద్యావంతురాలు ఆడిన నాటకంగా పోలీసులు తేల్చేశారు.
బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుల కోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి తనపై యాసిడ్ దాడి చేశారని ఆరోపించింది. జితేందర్తో పాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ పేర్లు చెప్పింది. యాసిడ్ దాడి చేసినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడంతో గాయాలు అయినట్లుగా తెలిపింది. దీంతో పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన స్థలంలో ఎలాంటి యాసిడ్ ఆనవాళ్లు కనిపించలేదు. ఇక దాడి చేసిన వ్యక్తి గురించి వాకబు చేయగా.. అతడు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోల్బాగ్లో సెల్ఫోన్ లొకేషన్ కనిపించింది. బైక్ పార్కు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏ రూపంలో చూసినా బాధితురాలి చెప్పిన స్టేట్మెంట్కు సరిపోవడం లేదు. దీంతో పోలీసులు గట్టిగా నిలదీయడంతో బాధితురాలు నిజాన్ని అంగీకరించింది. కట్టుకథగా తేల్చింది. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు.
బాధితురాలి తండ్రి అకీల్ ఖాన్కు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో జితేందర్ భార్య పని చేస్తోంది. అయితే ఆమెపై కన్నేసిన అకీల్ ఖాన్ అత్యాచారానికి తెగబడ్డాడు. 2021 నుంచి 2024 వరకు పని చేసిన సమయంలో అకీల్ ఖాన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అకీల్ ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి కూతురి సాయంతో యాసిడ్ కుట్ర పన్నాడు. యాసిడ్ దాడిలో జితేందర్ను ఇరికించాలని ప్లాన్ చేశాడు.
ఇక జితేందర్ మిత్రులైన ఇషాన్, అర్మాన్ను కూడా అకీల్ ఖాన్ బంధువులే. వీళ్లిద్దరితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇలా ఈ ముగ్గురిని కేసులో ఇరికించాలని అకీల్ ఖాన్ ప్రణాళిక గీసి కూతురితో అమలు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించారు. టాయిలెట్ క్లీనర్ మీద పోసుకుని యాసిడ్ దాడికి జరిగినట్లుగా డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నారు. దీంతో తండ్రి, కూతురిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.



