– ఏడీ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయం పై యువత దృష్టి సారించినప్పుడే నాణ్యమైన దిగుబడులు,పంటల్లో అధికోత్పత్తి సాధ్యం అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ అన్నారు. భద్రాచలం కేంద్రం గా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈఎఫ్ఐసీఓఆర్ అనే స్వచ్ఛంద సంస్థ సాగుపై యువ రైతులకు శిక్షణ అనే ప్రాజెక్టులో భాగంగా స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 33 మంది యువ రైతులు హాజరైన ఈ కార్యక్రమంలో వారు కళాశాలలో సాగుచేస్తున్న వివిధ రకాల ప్రయోగ పంటలను సాగు చేసే పద్ధతులను అవగాహన పెంచుకున్నారు.
ముఖ్యంగా ఉద్యాన పంటలైన కొబ్బరి,ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేయదగ్గ అంతర పంటల గురించి,సాంకేతికంగా తెలుసుకున్నారు.అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం,జీవ ఎరువు,వానపాముల తయారీ గురించి తెలుసుకున్నారు. ఈ క్షేత్ర సందర్శన ను కళాశాల ఆచార్యులు డాక్టర్ నీలిమ,డాక్టర్ బి దీపక్ రెడ్డి సమన్వయ పరచగా, ప్రాజెక్టు డైరెక్టర్ ధర్మరాజు నిర్వహించారు. కళాశాలను సందర్శించి కొత్త పంటలను,అంతర పంటలను తెలుసుకోవడం,పుట్టగొడుగుల పెంపకం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అది వారికి చాలా ఉపయోగకరంగా ఉందని యువ రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు.



