కాంట్రాక్ట్ ఉల్లంఘనలపై ఆరోపణలు
న్యూఢిల్లీ : రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగాల్లో మోడీ ప్రభుత్వ కృషిని ఘనంగా కీర్తిస్తూ గత సంవత్సరం మార్చిలో డీడీ నేషనల్ ఛానల్ డాక్యుమెంటరీ సిరీస్ను ప్రసారం చేసింది. దీనికి ప్రముఖ పర్యాటక ఇన్ఫ్లుయన్సర్ కమియా జైన్ యాంకర్గా వ్యవహరించారు. ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే అవే ఎపిసోడ్లు ప్రయివేటు యూట్యూబ్ ఛానల్స్లో దర్శనమిచ్చాయి. ఈ ఉదంతపై ఆంతరంగికంగా పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాంట్రాక్ట్ ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. చివరికి వీటన్నింటినీ ప్రసారభారతి అసాధారణ రీతిలో పరిష్కరించింది. ఈ వివాదానికి రూ.6.09 కోట్ల కాంట్రాక్ట్, రెండు మీడియా సంస్థలు, కమియా జైన్ భర్త సమ్మర్ వర్మ కేంద్ర బిందువు అయ్యారు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రసార సంస్థ ప్రయివేటు నిర్మాణ సంస్థలతో ఎలా సంబంధాలు నెరపిందనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మొదట… వర్క్ ఆర్డర్ను సాఫ్ట్లైన్ స్డూడియో సర్వీసెస్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ కంపెనీకి ఇచ్చారు. అయితే దీనిని నిర్వహించింది ఫోల్స్ మీడియా గ్రూప్ అనే మరో మీడియా సంస్థతో సంబంధమున్న సంస్థలు. ఈ మీడియా గ్రూప్కు సమ్మర్ వర్మ డైరెక్టర్, సీఈఓ. ప్రొడక్షన్ పనులను వేరే వారికి అప్పగించకూడదన్న ప్రసారభారతి విధానం, కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఇది జరిగింది. ఇక రెండోది…డీడీ నేషనల్లో ప్రసారమైన డాక్యుమెంటరీ సిరీస్ను కమియా జానీ ఏర్పాటు చేసిన ఫోల్స్ మీడియా ఛానల్స్ కర్లీ టేల్స్ (దీనిని కమియా జైన్ ఏర్పాటు చేశారు), మషాబుల్ ఇండియా తిరిగి ప్రసారం చేశాయి. ఇది కూడా కాపీరైట్, థర్డ్-పార్టీ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ప్రసారభారతే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక మూడో ఉల్లంఘన విషయానికి వస్తే అది ఎంతో విచిత్రంగా ఉంది. వీటన్నింటి నిర్వహణకు ఉద్దేశించిన పేపర్వర్క్పై ఉల్లంఘనలు జరిగిన నెలల తర్వాత సంతకాలు జరిగాయి.



