నవతెలంగాణ – తుంగతుర్తి
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తుంగతుర్తి సీఐ నరసింహారావు హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు.
మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి వాహనాల తనిఖీ,డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్దని, రోడ్లపై కేకులు కట్ చేయవద్దని అన్నారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులు, యువతకు ఆయన సూచించారు.



