Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూలీల మృతి బాధాకరం

కూలీల మృతి బాధాకరం

- Advertisement -

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
చట్ట ప్రకారం పరిహారంతోపాటు కంపెనీ నుంచి సహాయం : కార్మిక శాఖ మంత్రి వివేక్‌
ఆస్పత్రిలో కార్మికులకు పరామర్శ
మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కంపెనీ
నవతెలంగాణ-శంకర్‌పల్లి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో క్రేన్‌ కూలడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందడం బాధాకరమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ అన్నారు. మరో పది మంది గాయపడ్డారన్నారు. స్థానిక ఆస్పత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా కార్మికులను మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి మంత్రి పరామర్శించారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. షెడ్డులో తలదాచుకున్న 17 మంది కార్మికులపై క్రేన్‌ ఒక్కసారిగా పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారని, ఆస్పత్రికి తరలిస్తుంగా మరో ఇద్దరు మృతిచెందారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం వచ్చేలా చూస్తామన్నారు. కార్మిక చట్టం ప్రకారంగా అందాల్సిన పరిహారంతోపాటు యాజమాన్యంతో కూడా వారికి నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులు కంపెనీనే భరిస్తుందని స్పష్టం చేశారు. కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే కంపెనీని సందర్శించారని, పూర్తి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఈదురుగాలులతోనే ప్రమాదం జరిగిందా.. కంపెనీలో అన్ని ప్రమాణాలు పాటించారా.. కార్మికుల భద్రతకు యాజమాన్యం తీసుకున్న చర్యలేమిటీ.. అనే ఆంశాలపై పూర్తి వివరాలు సేకరించి, అధికారుల ద్వారా నివేదిక తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ శాత ప్రవీణ్‌కుమార్‌, నాయకులు గోపాల్‌ రెడ్డి, కంపెనీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

బాధితులకు పరిహారం ప్రకటన
భారీ ఈదురుగాలులకు క్రేన్‌ కూలి మృతిచెందిన కార్మికులకు సంబంధించి కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు భరిస్తామని కంపెనీ ఎండీ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -