నవతెలంగాణ – కాటారం
కాటారం రైతు వేదికలో గురువారం హార్వెస్టర్ యజమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. రైతులకు కోతల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పంట కోతలను సమయానికి పూర్తి చేసి రైతులకు నష్టాలు కలగకుండా చూడాలని హార్వెస్టర్ యజమానులను కోరారు. కోతల సమయంలో ధుమ్ము, ధూళి ఎక్కువగా ఎగరకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ హార్వెస్టర్ యంత్రాలను సరైన విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆర్సీఎం స్థాయిని 18 నుంచి 20 మధ్య ఉంచాలని, బ్లోయర్ను ఆన్ మోడ్లో గాలి వెళ్లే దిశలో సరిగా సెట్ చేయాలని సూచించారు. దీంతో ధాన్యం నష్టపోకుండా, రైతులకు నాణ్యమైన దిగుబడి అందుతుందని వివరించారు. అలాగే రైతులకు సకాలంలో కోతలు నిర్వహించడం ద్వారా పంట నష్టాలు తగ్గుతాయని తెలిపారు. సమావేశంలో నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఏఈఓలు, హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు.



