రెండో విడతలో 91 శాతానికిపైగా పోలింగ్
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు
మొరాయించిన ఈవీఎంలు మే 4న తుది ఫలితాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. దీంతో రెండో విడతలో 91 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం గా ముగిసింది. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పశ్చిమబెంగాల్లో 294 స్థానాలు ఉండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఇందులో 93 శాతం ఓటింగ్ నమోదైంది. బుధవారం రెండోవిడతలో 142 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 1,448మంది అభ్యర్థులు బరిలో నిల్చోగా 3.21 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిక్షిప్తం చేశారు. ఇందుకోసం 41వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.
బారులు తీరిన ఓటర్లు
పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. భవానీపుర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ తన ఓటు హక్కును వినియోగించున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మెయిత్రా, అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సహా పలువురు ప్రముఖులు ఓటేశారు. రెండోవిడతలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో సీఎం మమతాబెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. భాత్ పాడా, రాణాఘాట్, కోల్కతా ఉత్తర్, కోల్కతా దక్షిణ్, రాశ్ బెహారీ, జాధవ్ పుర్, బాలీగంజ్లు రెండో దశలో కీలకంగా ఉన్నాయి.
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు..ఆస్తులు ధ్వంసం
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదు రు ఘటనలు చోటుచేసుకున్నాయి. హింస, ఆస్తుల ధ్వంసం వంటివి జరిగాయి. చాప్ర, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్టు పోలీసులు ధ్రువీకరించారు. చాప్రాలో బూత్ నంబర్ 53లో బీజేపీ ఏజెంట్ మోషారెఫ్ మీర్పై దాడి జరిగింది. అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అధికార టీఎంసీకి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్పై దాడి చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపించారు. మరోపక్క ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
మొరాయించిన ఈవీఎంలు..
హావ్డా జిల్లా బల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్తా ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణను అదుపు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఓటింగ్ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నకిలీ పోలింగ్ ఏజెంట్లను నియమించారన్న ఆరోపణలతో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతు దారుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పలు పోలింగ్ బూత్ల్లో ఓట్లు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కంచుకోటైన డైమండ్ హార్బర్లోని ఫల్తా నియోజకవర్గంలో పలు పోలింగ్ బూత్లలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫల్తా నియోజక వర్గంలోని పలు పోలింగ్ బూత్ల్లో కమలం గుర్తు కనిపించకుండా చేసి, ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.



