పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్రమం
పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి
సుప్రీం సాక్షిగా బట్టబయలైన ద్రోహబుద్ధి : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విచారణ అర్హత లేని పిటిషన్ను సుప్రీంకోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సాక్షిగా ఆయన నిజస్వరూపం, ద్రోహ బుద్ధి బట్టబయలైందని విమర్శించారు. నాడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇప్పుడు చాతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని తెలిపారు. ఈ విషయం కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా?అని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకుని ఢిల్లీ దాకా వెళ్లాలా?అని అడిగారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేస్తూ రేవంత్రెడ్డి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. రిట్ ఉపసంహరించుకుని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పడమంటే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని విమర్శించారు. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడమనేది ఏండ్లు గడిచినా ముగియని కథ అని తెలిపారు. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబుకు రేవంత్రెడ్డి గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉందని పేర్కొన్నారు. పంచాయితీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు కూర్చొని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పచెప్పడమేనా చర్చల లక్ష్యమని అడిగారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా?అని తెలిపారు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు రేవంత్రెడ్డి సిద్ధమయ్యారనీ, తెలంగాణ సమాజం ఆయన్ను క్షమించబోదని పేర్కొన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదనీ, రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామనీ, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామని ప్రకటించారు.
విచారణ అర్హత లేని తెలంగాణ పిటిషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



