Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంతర్రాష్ట్ర షట్టర్‌ లిఫ్టింగ్‌ ముఠా అరెస్ట్‌

అంతర్రాష్ట్ర షట్టర్‌ లిఫ్టింగ్‌ ముఠా అరెస్ట్‌

- Advertisement -

ఇద్దరు రిమాండ్‌..పరారీలో మరో ఇద్దరు
సొత్తు కొనుగోలు చేసిన వారిపైనా కేసు
14 తులాల బంగారం, 6 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య


నవతెలంగాణ-కంఠేశ్వర్‌
నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు బంగారు షాపుల్లో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ పి.సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మణ్‌సింగ్‌ భావూరి, ప్రేమ్‌సింగ్‌ ధరంసింగ్‌ కిచ్చి, సాగర్‌సింగ్‌, మహమ్మద్‌ షేక్‌ ముఠాగా ఏర్పడ్డారు. డిసెంబర్‌ 21న అర్ధరాత్రి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో బైక్‌లు దొంగిలించి బోధన్‌ పట్టణానికి చేరుకున్నారు. బోధన్‌ పట్టణంలో రెండు బంగారు షాపుల షట్టర్‌లను ధ్వంసం చేసి 35 తులాల బంగారు నగలు, 14 కిలోల వెండిని చోరీ చేసి పరారయ్యారు. ఈ దోపిడీ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఐ వెంకటనారాయణ బృందం దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

ఆదివారం రాత్రి బోధన్‌ బైపాస్‌ ఆచంపల్లి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి నలుగురు పారిపోతుండగా వెంబడించారు. దోపిడీ ముఠాలోని లక్ష్మణ్‌సింగ్‌, ప్రేమ్‌సింగ్‌ ధరంసింగ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 14 తులాల బంగారం, 6కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతానికి చెందిన నయీమ్‌ నదీమ్‌ సయ్యద్‌, లక్ష్మీకాంత్‌ సంతోష్‌ టాక్‌తోపాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన ఇద్దరు నిందితులతోపాటు చోరీ సొత్తు కొన్న మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఈ దోపిడీ ముఠాను పట్టుకునేందుకు కృషి చేసిన బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, బోధన్‌ నగర సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌, ఏఎస్‌ఐ బాబురావు, సిబ్బంది రవి, మహేష్‌, సాయికుమార్‌, అశోక్‌ను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -