Friday, May 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకోహినూర్‌ వజ్రం భారత్‌కుతిరిగిచ్చేయాలి

కోహినూర్‌ వజ్రం భారత్‌కుతిరిగిచ్చేయాలి

- Advertisement -

కింగ్‌ చార్లెస్‌ను కోరుతానన్న న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ
న్యూయార్క్‌ : చారిత్రక కోహినూర్‌ వజ్రం భారత్‌కు తిరిగి ఇచ్చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-3ని కలిసే అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ తెలిపారు. బుధవారం కింగ్‌ చార్లెస్‌ను కలవడానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో బ్రిటన్‌ రాజుకు మీ సందేశం ఏమిటని ప్రశ్నించగా, ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారతీయ మూలాలున్న మేయర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘ఒక కార్యక్రమంలో కాకుండా, బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ 3తో విడిగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతా’ అని మమ్దానీ అన్నారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 3, రాణి కెమిల్లా నాలుగు రోజుల అమెరికా పర్యటనలో బాగంగా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద 9/11 దాడుల 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించారు.

ఈ కార్యక్రమానికి మమ్దానీ కూడా హాజరయ్యారు. కింగ్‌ చార్లెస్‌ను కలిశారు. ఇద్దరి మధ్య సంభాషణ సైతం జరిగింది. కానీ కోహినూర్‌ గురించి ప్రస్తావించారా లేదా అనేది స్పష్టత లేదు. రాజు, మమ్దానీల మధ్య చర్చల వివరాలను మేయర్‌ కార్యాలయం వెల్లడించలేదు లాహోర్‌ ఒప్పందం వివాదానికి కేంద్రబిందువు కోహినూర్‌ వజ్రం ప్రపంచంలో అత్యంత వివాదాస్పద రత్నాలలో ఒకటి. మౌంటెన్‌ ఆఫ్‌ లైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ వజ్రం భారతదేశంలోని కొల్లూరు గనిలో లభించింది. ఇది 186 క్యారెట్ల బరువు ఉండేది. మొఘల్స్‌, సిక్కులు సహా అనేక భారతీయ రాజవంశాల చేతుల్లోకి వెళ్లిన ఈ వజ్రం 1849లో జరిగిన రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం అనంతరం బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ చేతికి వెళ్లింది. అప్పటి పదేండ్ల మహారాజా దులీప్‌సింగ్‌ను లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేయమని బలవంత చేసింది. దీంతో ఆ ఒప్పందం ద్వారా ఈ వజ్రాన్ని క్వీన్‌ విక్టోరియాకు అప్పగించారు. అప్పటినుంచి ఆ వజ్రం బ్రిటన్‌ ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం 105.6 క్యారెట్లకు కట్‌ చేసిన కోహినూర్‌ వజ్రం క్వీన్‌ ఎలిజబెత్‌ క్వీన్‌ మదర్‌ కిరీటంలో అమర్చబడి ఉంది.

టవర్‌ ఆఫ్‌ లండన్‌లో భద్రంగా ఉంది. అయితే భారతీయ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, రాజుతో ఒత్తిడిలో కుదిరిన ఒప్పందానికి నైతిక విలువ లేదని చెబుతున్నారు. భారత్‌కు కోహినూర్‌ ఒక సాంస్కృతిక గర్వ చిహ్నమే కాకుండా, వలస పాలనలో దోపిడీకి ప్రతీకగా భావిస్తారు. దీనిని తిరిగి రాని అత్యంత విలువైన ఆస్తిగా చూస్తున్నారు. కోహినూర్‌ను తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. గ్రీస్‌లోని ఎల్గిన్‌ మార్బుల్స్‌, ఆఫ్రికాలోని బెనిన్‌ బ్రాంజెస్‌ వంటి చారిత్రక వస్తువులను తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మమ్దానీ వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయ చర్చకు దారితీస్తున్నాయి. మమ్దానీ వ్యాఖ్యలు ఒక సాధారణ దౌత్య భేటీని చారిత్రక న్యాయం అంశంగా మలిచాయి. కోహినూర్‌ లండన్‌లో ఉన్నప్పటికీ, దాని చుట్టూ జరిగే చర్చ మాత్రం భారత్‌కే కేంద్రీకృతమై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -