– పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ కొత్త డ్రామా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే రేవంత్రెడ్డి ప్రభుత్వం సిట్ వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలెట్టిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే ఓ టీవీ చానెల్ ఒక మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు ఇతర చానెళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వార్త వేసిన చానెల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. అసలు ఈ సిట్ ఎవరిని కాపాడటానికి లేదా ఎవరిని వేటాడడానికి అని ఆయన అడిగారు. ప్రభుత్వ ఓవరాక్షన్ను ప్రజలంతా గమనిస్తున్నారనీ, మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు అక్రమాలపై చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తూ ఒక మంత్రి పీఏ, రేవంత్రెడ్డి సహచరుడు కలిసి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి సిట్ ఉండబోదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ములుగు జిల్లాలో మంత్రి పీఏనే ఇసుక దందాలో రూ.కోట్లు దండుకుంటున్నా ఆ ఇసుకాసురుల మీద కేసుల్లేవనీ, అలాగే రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకుని హైదరాబాద్ శివార్లలో రూ.వందల కోట్ల భూకబ్జాలకు పాల్పడితే, ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీస్ అధికారిని బదిలీ చేశారని గుర్తు చేశారు. కానీ ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండబోదని తెలిపారు.
ఏఐసీసీ కార్యదర్శి, సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడు సంపత్ కుమార్ ఒక జాతీయ రహదారి కాంట్రాక్టర్ను మారణాయుధాలతో బెదిరించి రూ.ఎనిమిది కోట్లు డిమాండ్ చేసినా ఎలాంటి చర్యల్లేవని కేటీఆర్ విమర్శించారు. కేజీబీవీల్లో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన రూ.వంద కోట్ల కుంభకోణంపై గానీ, రూ.వందల కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఒక ఐఏఎస్ అధికారిని బలిచేసిన ఉదంతంపై గానీ ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులిచ్చి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన స్కామ్ మీద, అలాగే 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో దుర్వినియోగం జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరుతో కమిషన్లు, సిట్ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాను వేధించేందుకే ‘సిట్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



