పరకాల సమీక్షా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి
నవతెలంగాణ – పరకాల
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి వారు జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్పాయ్తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, విద్య మరియు వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరాలని, ఇందులో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్పాయ్ మాట్లాడుతూ, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్మన్, ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీవో మేన శ్రీను, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు, ఏసీపీ సతీష్ బాబుతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచులు, కౌన్సిలర్లు మరియు మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



