ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి చేరుకున్న ఆయన మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న మృతుల కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న వారిని ఆయన ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడం తీరని లోటని ఆయన అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆరుగురి మృతదేహాలను అంబులెన్స్లలో వారి స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను తరలించే వరకు కేటీఆర్ అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఓఆర్ఆర్ మృతులకు కేటీఆర్ నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



