నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
మే 11 నుండి 17 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ‘విద్యా వారోత్సవాలు’ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జిల్లావ్యాప్తంగా ‘విద్యా వారోత్సవాలను’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి, మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఈ ఉత్సవాలు ఒక వేదికగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. మే 11 (సోమవారం): జిల్లాలోని పాఠశాలల్లో పూర్తయిన సివిల్ పనుల ప్రారంభోత్సవం మరియు మంజూరైన కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
అలాగే సృజనాత్మక వేసవి శిబిరాలను జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలలో ఘనంగా ప్రారంభిస్తారు. రాజపేట మండలంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ రాజపేట పాఠశాలలో అదనపు తరగతి గదులు మరియు సైన్స్ ల్యాబ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టరు, జిల్లా విద్యాశాఖాధికారి సమక్షంలో నిర్వహించబడుతుందనారు. జిల్లాలోని వివిధ మండలాల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, నాబార్డ్ పనులు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించతాయి. మే 12 (మంగళవారం): పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ‘రెమెడియల్ క్యాంపుల’ ప్రారంభోత్సవం. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించేలా అవగాహన కల్పిస్తారు.
• మే 13 (బుధవారం): నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్లు, మున్సిపల్ వార్డు సభ్యులతో వర్క్షాప్. ప్రభుత్వ విద్యా పథకాల్లో స్థానిక సంస్థల భాగస్వామ్యం, ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ పాత్రపై చర్చ ఉంటుంది.
• మే 14 (గురువారం): ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ ర్యాలీలు మరియు తల్లిదండ్రుల సమావేశాలు మెగా పీటీమ్ నిర్వహణ, ఉత్తమ హాజరు కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాల పంపిణీ మరియు వంటల పోటీలు నిర్వహిస్తారు.
• మే 15 (శుక్రవారం): జిల్లా, మండల గ్రంథాలయాల్లో ‘గ్రంథాలయ దినోత్సవం’. పుస్తక ప్రదర్శనలు, ఉత్తమ పాఠకులకు గుర్తింపు వంటి కార్యక్రమాలు చేపడతారు.
• మే 16 (శనివారం): ‘కళా వైభవం’ పేరుతో సాంస్కృతిక దినోత్సవం. కోలాటం, లంబాడీ నృత్యం, ఒగ్గు కథ వంటి జానపద కళల ప్రదర్శనలు మరియు విద్యార్థుల చిత్రలేఖన ప్రదర్శనలు ఒక పీఎంశ్రీ పాఠశాల నందు ఉంటాయి.• మే 17 (ఆదివారం): ‘విద్యా విజయోత్సవం’ – ముగింపు వేడుకలు. జిల్లా స్థాయి టాపర్లు (పదవ తరగతి, ఇంటర్మీడియట్, క్రీడలు) 9 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రాలతో సత్కారం ఉంటుందని తెలిపారు.
ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.



