నవతెలంగాణ-మద్నూర్
శనివారం అమావాస్య కోసం భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటారు. ఆరోజు దేవుణ్ణి దర్శించుకుంటే సలక సౌభాగ్యాలు, కష్టాలు తొలగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. నేడు శనివారం అమావాస్య కావడంతో మూడు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో గల పేరు గాంచిన సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నేడు స్వామి వారికి అభిషేకాలు, నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని వారి విశ్వాసం. ఇందులో భాగంగా శనివారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు క్యూ లైన్ లో బారులుతీరారు. ఈ జనసంద్రోహం చూస్తే స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నట్టే అనిపించింది.
ఈ క్రమంలో దెగ్లూరు, మద్నూర్, భక్తుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద టెంట్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అంతేకాదు దెగ్లూర్ డాక్టర్ అమిత్ ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీగా మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ సరిపడా భోజనాన్ని ఆయన ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ డాక్టర్ అమిత్ ను ఘనంగా సన్మానించారు.



