నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లిదండ్రులు కట్టడి చేయడంతో ముగ్గురు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదో అంతస్తు నుంచి దూకి చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. విషిక (16), ప్రాచి (14), పాఖి (12).. ముగ్గురు బాలికలూ చక్కగా కలిసి ఉండేవారు. తిండి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ అన్నీ కలిసే చేసేవారు. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వారికి ఆన్ లైన్ గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. ఆ తర్వాత అది వ్యసనంగా మారింది. ఇలా గేమ్స్ ఆడేందుకు తరచూ స్కూలుకు డుమ్మా కొట్టేవారు.
పిల్లల తీరుతో విసిగిపోయిన పేరెంట్స్.. ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దని, బాగా చదువుకోవాలని గట్టిగా హెచ్చరించారు. గేమ్స్ ఆడేందుకు వీలులేకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలికలు ముగ్గురూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున తాము ఉంటున్న బిల్డింగ్ పైకెక్కి తొమ్మిదో అంతస్తు నుంచి దూకారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



