మోడీపై పీయుశ్ గోయల్ ప్రశంసలు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ‘స్నేహం’ కారణంగానే అత్యుత్తమ ఒప్పందం కుదిరిందని, మన పొరుగు దేశాలతో పోలిస్తే ఇదే మంచి ఒప్పందమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయుశ్ గోయల్ తెలిపారు. అయితే ఒప్పందం వివరాలేమిటో ఆయన వెల్లడించలేదు. వాటిని త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. వ్యవసాయం, పాడి సహా కీలక రంగాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రధాని చూశారని అన్నారు. గోయల్ తన 20 నిమిషాల పాత్రికేయుల సమావేశంలో రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలపై విమర్శలు సంధించేందుకే ప్రాధాన్యత ఇచ్చారు.
వాణిజ్య ఒప్పందంపై పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రభుత్వం భావించిందని, అయితే ప్రతిపక్షాల ప్రవర్తన కారణంగా ఆ పని చేయలేకపోయిందని చెప్పారు. ఒప్పందం గురించి ట్రంప్ ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నించగా టారిఫ్ తగ్గింపుపై ప్రకటన చేయాల్సింది వారే కదా అని గోయల్ బదులిచ్చారు. ఒప్పందం వివరాల జోలికి వెళ్లకుండా ట్రంప్తో మోడీకి ఉన్న స్నేహబంధాన్ని గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒప్పందం తుది వివరాలను సంయుక్త ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అమెరికా వ్యవసాయోత్పత్తులు భారత మార్కెట్లలో ప్రవేశిస్తాయంటూ ఆ దేశ వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చేసిన ప్రకటనను గోయల్ ప్రస్తావించలేదు. వ్యవసాయ, డెయిరీ రంగాలను పరిరక్షించుకుంటామని మాత్రం తెలిపారు.
ఆ రంగాల పరిరక్షణలో విజయం సాధించాం
వాణిజ్య ఒప్పందం సందర్భంగా సున్నితమైన రంగాల పరిరక్షణలో విజయం సాధించామని, అదే సమయంలో చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పరిశ్రమకు నూతన అవకాశాలు లభిస్తాయని పీయుష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల చుట్టూ ప్రభుత్వం స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచిందని చెప్పారు. ఆహారం, వ్యవసాయానికి సంబంధించి భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, వికసిత్ భారత్ 2047 దిశగా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇది ఒక కీలకమైన అడుగు అని తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని గోయల్ చెప్పారు.



