నవతెలంగాణ-హైదరాబాద్: పసిఫిక్ దేశం ఫిజీలో బ్లూటూత్ ట్రేండ్ అనే ఒక పెడ ధోరణి తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు పదార్థాలు(డ్రగ్స్) కొనుగోలు చేసే స్థోమత లేనివాళ్లు, అప్పటికే డ్రగ్స్ తీసుకున్నవారి రక్తం ఎక్కించుకోవడాన్నే అక్కడ బ్లూటూత్ ట్రేండ్ గా పిలుస్తున్నారు. దీనివల్ల HIV వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. ఈ ధోరణి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆదోళన వ్యక్తం చేస్తోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఫిజీలో 2024లో 1583 HIV కేసులు నమోదయ్యాయి. 2025లో తొలి ఆరు నెలల్లోనే 1226 కేసులు వెలుగు చూశాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు ఫిజీ ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి ప్రధాన కారణం బ్లూటూత్ ట్రేండ్ అని చెప్పింది.
డ్రగ్స్ కొనుగోలు చేయడానిక డబ్బులు లేనివారు, కిక్ కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడమే ఈ ట్రేండ్. క్రిస్టల్ మెథ్ డ్రగ్ వాడకం ఈ పరిస్థితికి కారణమైంది. ఇలా ఒకరి రక్తాన్ని మరొకరు ఎక్కించుకోవడానికి అసురక్షిత పద్ధతులను అనుసరిస్తుండటంతో హెచ్ఐవీ వ్యాప్తి అనేది పెరుగుతోంది. ఫిజీలో హెచ్ఐవీ వ్యాప్తి ఆరోగ్యకరమైన సమస్య మాత్రమేకాదని, సమాజ పురోగతిని దెబ్బతీసే ఒక ముప్పు అని ఐక్యరాజ్యసమితి డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి వైద్య సదుపాయాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.
కాగా, బీచ్లు, ప్రకృతి అందాలు, రిసార్టులతో ఆకర్షించే ఫిజీ..పర్యాటకుల ప్రముఖ కేంద్రంగా పేరుపొందింది. గతేడాది ఆ దేశంలో 9,86,367 మంది పర్యటించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.



