Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కట్టుదిట్టం చేయాలి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కట్టుదిట్టం చేయాలి

- Advertisement -

నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై
కఠిన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌‌లోని రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించాలని చెప్పారు. వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో రెండు స్పెషల్ స్క్వాడ్‌లను తనిఖీలు ముమ్మరం చేయనున్నాయని ప్రకటించారు.

విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్టు గుర్తిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు నడుపుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు రాష్ట్రంలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని అన్నారు. అలాగే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దన్నారు. ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్‌ వికాస్‌‌రాజ్‌, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అదనపు రవాణా శాఖ కమిషనర్‌ రమేష్, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, డీటీసీ రవీందర్‌‌కుమార్‌, వెంకట రమణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -