నిజామాబాద్లో అత్యల్పంగా 59.12 శాతం
ఎల్లారెడ్డిలో అత్యధికంగా 79.77 శాతం పోలింగ్
పోలీసులు, ఎన్నికల సిబ్బందిని దూషించిన ఎంపీ అరవింద్, కేసు నమోదు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి భావించినట్టే అర్బన్ కేంద్రాల్లోని మున్సిపాల్టీల్లో ఓటర్లు బద్ధకించారు. ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో పోలింగ్ శాతం తగ్గింది. అయితే రూరల్ ప్రాంతాల్లోని మున్సిపాల్టీల్లో మాత్రం ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. చెదురుముదురు ఘటనలు మినహా.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా ఎల్లారెడ్డిలో 79.77, బిచ్కుందలో 78.49 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో పలు చోట్ల కాంగ్రెస్-బీజేపీ బాహాబాహీకి దిగారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులతో ఆందోళనకు దిగారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీంగల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాల్టీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం 7-9 గంటల మధ్య ఓటింగ్ మంద కొడిగా సాగగా.. 9-1 మధ్య కొంత మేర పుంజుకుంది. అనంతరం ఒంటి గంట నుంచి మూడు వరకు, అనంతరం ఐదు వరకు కొద్ది మేర పోలింగ్ శాతం నమోదైంది. అర్బన్ ఏరియాలైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి మున్సిపాల్టీల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. నిజామాబాద్లో గత మున్సిపల్ ఎన్నికల్లో 66 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 59.12 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి కనబరచలేదని అభ్యర్థులు పెదవివిరిచారు.
ఆర్మూర్లో 68 శాతం, బోధన్లో 68.64 శాతం, భీంగల్లో 69.78 శాతం పోలింగ్ నమోదైంది. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో ఉదయం వేళ నెమ్మదిగా సాగగా.. తర్వాత పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో బిచ్కుందలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ బందోబస్తు నిర్వహించగా.. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణ సముదాయాలను ముందస్తుగా మూసివేయించారు. బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల ఆధ్వర్యంలో గుంపులుగా గూమి గూడారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్పై కేసు నమోదయింది.
పోలీసులను దూషించిన ఎంపీ అరవింద్, కేసు నమోదు
పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థిని బయటకు పంపించారంటూ.. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసులను, పోలింగ్ అధికారులను దూషించారు. పరుషపదజాలంతో, బూతులు తిడుతూ విధుల్లో ఉన్నవారిని భయబ్రాంతులకు గురి చేశారు. నేరుగా పోలింగ్ బూత్లోకి అనుచరులతో వెళ్లి వీడియో రికార్డింగ్ చేయించగా.. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ ఘటనపై ఒకటో టౌన్లో వివిధ సెక్షన్ల కింద ఎంపీపై కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్ 1వ టౌన్ ఎస్హెచ్వో బి.రఘుపతి వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా డ్యూటీలో ఉన్న గుర్రం నారాయణ, టౌన్-1 పోలీస్ స్టేషన్కు చెందిన సలీమ్, మాక్లూర్ పోలీస్ స్టేషన్కు చెందిన శ్రీనివాస్ నిజామాబాద్ నగరంలోని మార్వాడీ స్కూల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎంపీ అరవింద్ కార్యకర్తలతో వచ్చి ”287 పోలింగ్ బూత్ ఎక్కడ, క్యాండిడేట్ను ఎవరు బయటకు పంపిచారు? తన్నులు తింటారా, ఎవడు తింటాడు తన్నులు, ఒళ్లు బలిసిందా..? కండ్లు నెత్తికెక్కాయా..? దిమాక్ కరబయిందా పోలీసోళ్లది” అంటూ పరుషపదజాలంతో తిట్టాడు.
బంటు ప్రవీణ్ అనే కార్యకర్తను ఉద్దేశించి ‘నువ్ లోపలకి పో.. నిన్ను ఎవడు బయటకు పంపితే వాడిని తన్నుకుంటూ తీసుకురా’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎంపీతో పాటు అనుచరులు దాదాపు 7-8 మంది పోలింగ్ బూత్లోకి వెళ్లి.. వీడియో కెమెరా, స్టిల్ కెమెరాతో ఎన్నికల బూత్లు 287, 286, 285లోకి వెళ్లి పోలింగ్ స్టాఫ్ను కూడా పరుషపద జాలంతో మాట్లాడుతూ భయబ్రాంతులకు గురి చేశారు. కార్యకర్తలతో వచ్చి విధులకు ఆటంకం కల్పించి ఎన్నికల బూత్లోకి నిషేధిత స్టిల్ కెమెరా, వీడియో కెమెరాలతో వెళ్లి డ్యూటీలో ఉన్న పోలింగ్ సిబ్బందిని, పోలీసులను తిట్టి బెదిరించిన విషయంలో ఫిర్యాదు చేయగా.. సెక్షన్స్ 132, 223, 296(బి) బీఎన్ఎస్ సెక్షన్ 226 తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019ల్లో క్రైమ్ నెంబర్ 51/26గా కేసు నమోదు చేసినట్టు ఎస్హెచ్వో తెలిపారు.



