నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా శివరాత్రి సందర్బంగా ఊరిలోని శివగుట్ట పై నిర్వహించే జాగరణను పురస్కరించుకొని గ్రామంలోని వాడ వాడల రోడ్లపై నీళ్లను పోయించారు. శివరాత్రి జాగరణకు వచ్చే భక్తులకు దుమ్ము, ధూళితో ఇబ్బంది లేకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా గ్రామంలోని అన్ని రోడ్లను నీటితో శుభ్రం చేయించినట్లు సర్పంచ్ వూరే నీలవేణి దశరథ్ తెలిపారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా రోడ్లను నీటితో శుభ్రం చేయించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.శివగుట్టపై మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. సోమవారం గుట్ట వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని రోడ్లను శుబ్రం చేస్తున్న కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు.



