Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంఇదొక ఉచ్చు!

ఇదొక ఉచ్చు!

- Advertisement -

దేశ వస్త్ర పరిశ్రమ నాశనానికి నాంది : అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : ఇటీవల కుదిరిన భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో వస్త్ర పరిశ్రమ పూర్తిగా నాశనమవుతుందని, నిర్మూలించబడుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ ఒప్పందం ఒక ‘ఉచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్‌ వీడియో స్టేట్‌మెంట్‌ను శనివారం విడుదల చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసే ‘దార్శనికత కలిగిన ప్రభుత్వం’ అయితే పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయో జనాలు కాపాడేందుకు, వారి సంక్షేమానికి హామీ కల్పించేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అన్నారు. అందుకు పూర్తి విరుద్ధమైన పద్ధతిలో, పత్తి, వస్త్ర రంగాలకు తీవ్రంగా నష్టం వాటిల్లేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.

బంగ్లాదేశ్‌పై ‘జీరో శాతం’, భారత్‌పై 18శాతం టారిఫ్‌తో ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందే ఐదు కోట్ల కుటుంబాలు దెబ్బ తింటాయన్నారు. ఈ రంగంలో భారత్‌కు గట్టి పోటీదారు బంగ్లాదేశేనని అన్నారు. ”అమెరికాతో కుదుర్చుకున్న ఈ వాణిజ్య ఒప్పందం వస్త్ర రంగాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది. యావత్‌ దేశానికి ఇది తెలుసు. అలాగే నరేంద్ర మోడీకి కూడా తెలుసు. బంగ్లాదేశ్‌కు ఫ్రీ పాస్‌ – జీరో శాతం పన్ను లభించిందని, భారత్‌కు 18శాతం పన్ను వేశారని పార్లమెంట్‌లో కూడా వివరించాను. బంగ్లాదేశ్‌ వస్త్ర పరిశ్రమ.. భారత్‌ వస్త్ర పరిశ్రమను అంతం చేస్తుంది.” అని రాహుల్‌ గాంధీ ఆ ప్రకటనలో వివరించారు.

భారత్‌, అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాహుల్‌ లోక్‌సభలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ పలుమార్లు విమర్శలు చేశారు. దానిపై వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ ఎలాంటి ఒప్పందమైతే కుదుర్చుకుందో అదే రీతిలో భారత్‌ కూడా కుదుర్చుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ గురించి తాను పార్లమెంట్‌లో ప్రశ్నించగా, కేంద్ర మంత్రి ఒకరు బదులిస్తూ, అమెరికా నుంచి పత్తిని మనం దిగుమతి చేసుకుంటే అదే ప్రయోజనాన్ని మనం కూడా పొందగలమని చెప్పారని రాహుల్‌ శనివారం నాటి వీడియో స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

‘ఈ వాస్తవాన్ని దేశ ప్రజలకు తెలియనివ్వకుండా ఎందుకు దాచారు?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. భారత్‌ విధానం ఒక ఉచ్చు వంటిదని వ్యాఖ్యానించారు. ”అమెరికన్‌ పత్తిని గనుక మనం దిగుమతి చేసుకుంటే మన సొంత రైతులే నాశనమవుతారు. ఒకవేళ మనం దిగుమతి చేసుకోకపోతే మన వస్త్ర పరిశ్రమ వెనుకబడిపోతుంది, నాశనమవుతుంది.” అని వివరించారు. భారత్‌ నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం తగ్గించవచ్చు లేదా నిలుపుచేయవచ్చనే సంకేతాలను బంగ్లాదేశ్‌ కూడా ఇస్తోందని రాహుల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -