బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
గ్రామపంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు : మంత్రి దనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ – ములుగు
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నూతనంగా ఎన్నికైన ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట 4 మండలాల సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి చెత్త పొడి చెత్త నిర్వహణ స్టాల్ లను పరిశీలించారు. ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్దిదారులకు మంత్రి సీతక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. గ్రామాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను అందరికీ ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలని, గ్రామ అభివృద్ధి పై పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించాలని, ఉపాధి హామీ చట్టంలో కార్మికుల సంఖ్య పెంచేలా చూడాలని అన్నారు. సుమారు 500 కోట్ల రూపాయల నిధులను గ్రామ పంచాయతీలకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ భానోత్ రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి జిల్లా పంచాయతీ అధికారి, ఆత్మ కమిటీ చైర్మన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



