ఐపీఎల్ ధమాకా, అఫ్గాన్తో స్వదేశీ సిరీస్ అనంతరం టీమ్ ఇండియా తొలిసారి విదేశీ పర్యటనలో హంగామాకు సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన నేటి నుంచి ఆరంభం కానుండగా.. బెల్ఫాస్ట్లో ఆతిథ్య ఐర్లాండ్తో భారత్ నేడు తొలి టీ20లో బరిలోకి దిగనుంది. టీ20 ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ టీమ్ ఇండియా సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ వరల్డ్క్లాస్ క్రికెటర్ల పవర్హౌస్గా మారిని టీమ్ ఇండియా తుది జట్టులో చోటు సాధించటం ఇప్పుడు కష్టతరంగా మారింది. ప్రపంచకప్ aవిజయం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయాడు. తుది జట్టులో చోటు కోసం పోటీకి ఇది నిదర్శనం. భారత్, ఐర్లాండ్ తొలి టీ20 నేడు బెల్ఫాస్ట్లో ఆరంభం కానుండగా.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
అభిషేక్, సంజూలలో ఒకరిపై వేటు!
ఐర్లాండ్తో భారత్ తొలి టీ20 నేడు
సాయంత్రం 6 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
వైభవ్కు అవకాశం దక్కేనా? :
15 ఏండ్ల యువ సంచలనం ఇటు ఐపీఎల్లో, అటు భారత్-ఏ తరఫున ముక్కోణపు వన్డే సిరీస్లో తనంటే నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పేందుకు వైభవ్ సూర్యవంశీ అడుగు దూరంలో నిలిచాడు. అయితే, టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లో రాణించిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లలో ఒకరిపై వేటు పడితేనే వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కనుంది. వైభవ్కు ఐర్లాండ్తో సిరీస్లోనే అవకాశం ఇస్తారా? లేదంటే ఇంగ్లాండ్తో సిరీస్లో బరిలోకి దింపుతారా? అనేది ఆసక్తికరంగా మారనుంది. వైభవ్ సూర్యవంశీ బెంచ్కు పరి మితమైనా.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్లపై ఒత్తిడి కనిపించనుంది.
శ్రేయస్కు కెప్టెన్సీ సవాల్
శ్రేయస్ అయ్యర్ కొంత కాలంగా టీ20 జట్టులో లేకపో యినా.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్గా జట్టులోకి వచ్చాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్కు చోటు కల్పించలేక సెలక్టర్లు అతడికి పక్కనపెట్టారు. ఐపీఎల్లో కెప్టెన్గా గెలుపోటముల రికార్డు అమోఘం. 2024 సీజన్లో కోల్కతా నైట్రైడ ర్స్ను చాంపియన్స్గా నిలుపగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ను ఓసారి ఫైనల్స్కు చేర్చాడు. టీమ్ ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్తో కలిసి కోల్కతా నైట్రైడర్స్ డ్రెస్సింగ్రూమ్ పంచు కున్న అనుభవం శ్రేయస్కు కలిసి రానుంది. ఐర్లాండ్తో సిరీస్ను స్వీప్ చేసినా.. ఇంగ్లాండ్తో సిరీస్లో అయ్యర్కు అసలైన సవాల్ ఎదురుకానుంది.
రానాకు చోటుందా?
గాయంతో టీ20 ప్రపంచకప్ తో పాటు ఐపీఎల్కు దూరమైన పేసర్ హర్షిత్ రానా.. అఫ్గాన్ సిరీస్కు ఆఖర్లో జట్టులోకి వచ్చినా తుది జట్టులో నిలువలేదు. పేసర్లు ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్లు ఆడారు. తాజాగా టీ20 జట్టులోనూ ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ ఉన్నా రు. ఈ ఇద్దరిలో ఒకరిని పక్కనపెట్టి హర్షిత్ రానాను తుది జట్టులోకి తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు ఐర్లాండ్ జట్టు టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత సీనియర్లను కోల్పోయింది. కెప్టెన్ రాజీనామా చేయగా.. పేసర్లు గాయాలతో దూరమయ్యారు. యువ జట్టుతో బరిలోకి దిగుతున్న ఐర్లాండ్ రెండు మ్యాచ్ల్లో కనీస పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అగ్రజట్టు భారత్తో టీ20 సిరీస్లో సత్తా చాటి అందరి దృష్టిలో పడేందుకు ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు.



