పిజెటిఏయు యువజనోత్సవాలలో బి జె ఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ కి ఓవరాల్ ఛాంపియన్ షిప్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల వ్యవసాయ కళాశాల ప్రతిభలకు ప్రసిద్ధి అని కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.బి. సునీతాదేవి అన్నారు.ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆధునిక ఆలోచనలను వెలికితీసే కార్యక్రమం అగ్రి యూత్ ఫెస్ట్” (యువజనోత్సవాలు) ఈనెల 19వ తేది నుండి 21వ తేది వరకు 3 రోజుల పాటు రాజేంద్ర నగర్ లో ఘనంగా నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా ఉన్న 13 వ్యవసాయ కళాశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభలను ప్రదర్శించారు. ఈ యువజనోత్సవాలలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనపరిచారు. గ్రీన్ ఎక్స్పో , స్టోరీ టెల్లింగ్, జానపద గీతాలు, ఒగ్గుకథ, డ్యాన్స్, బీట్ లైవ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు.
అలాగే ఉపన్యాసం, వ్యాసరచన, దేశ భక్తి గీత రచన, స్పెల్ బీ, ఎకో రంగోలి, లైవ్ పెంటింగ్ పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచారు. జానపద నృత ప్రదర్శనలో తృతీయ స్థానంలో లో నిలిచారు. విద్యార్థుల ప్రతిభకు, సృజనత్మకతకు ఈ యువజనోత్సవాలలో ఓవరాల్ ఛాంపియన్ షిష్ ను బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.బి. సునీతాదేవి విద్యార్థులను అభినందించారు. యూనివర్శిటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ కళాశాలకు మంచి పేరు తీసుకు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని తమకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.



