– వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం
– విజేతలకు బహుమతుల ప్రదానం
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో శుక్రవారం మారకద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్వేత, కళాశాల బోధన సిబ్బంది డాక్టర్ సి.హెచ్. రాములు, డాక్టర్ ఎం. రాంప్రసాద్, డాక్టర్ పి. ఝాన్సీ రాణి, డాక్టర్ టి. శ్రావణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు మారకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
అడ్వకేట్ శ్వేత మాట్లాడుతూ మారకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై అమలయ్యే చట్టాలు, శిక్షల గురించి వివరించారు. మారకద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ సి.హెచ్. రాములు మాట్లాడుతూ మారకద్రవ్యాల వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి బాధ్యతగల భారత పౌరులుగా ఎదగాలని సూచించారు.
డాక్టర్ ఎం. రాంప్రసాద్, డాక్టర్ పి. ఝాన్సీ రాణి, డాక్టర్ టి. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మారకద్రవ్యాల సమస్య కేవలం ఆరోగ్యం లేదా సామాజిక సమస్య మాత్రమే కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు మారకద్రవ్యాల అక్రమ రవాణాను ఆదాయ వనరుగా ఉపయోగించి సమాజాన్ని తప్పుదోవ పట్టించడంతో పాటు ఆ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి మారకద్రవ్యాలను సమాజం నుంచి నిర్మూలించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పోస్టర్ తయారీ, ఉపన్యాసం, వీధి నాటకం, లఘుచిత్ర పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



