మండల పశువైద్యాధికారి విజయ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పశుగ్రాస కొరతను అధిగమించి, పాడి పశువులకు ఏడాది పొడవునా నాణ్యమైన మేత అందించేందుకు ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తున్న గడ్డి విత్తనాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి విజయ్ సూచించారు. శుక్రవారం బీర్కూర్ మండల పశువైద్య కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మండలానికి మొత్తం 45 బస్తాల గడ్డి విత్తనాలు అందినట్లు తెలిపారు.
ప్రతి బస్తాలో 5 కిలోల గడ్డి విత్తనాలు ఉండగా, ఒక్కో బస్తాకు రైతులు రూ.125 మాత్రమే చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతితో పశువైద్య కార్యాలయాన్ని సంప్రదించి విత్తనాలను పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పచ్చిమేత సాగును విస్తరించడం ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సహాయకురాలు సునీత, సిబ్బంది సాయిలు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



