సుప్రీంకోర్టు స్పందనతో న్యాయవ్యవస్థలో అవినీతి సెక్షన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ : తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే సెక్షన్ను 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపు స్తకం నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఉపసంహ రించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.’న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే సెక్షన్పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సెక్షన్ను దేశంలో న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి ఒక ప్రయత్నంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ విమర్శించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కించపరడానికి లేదా ప్రశ్నించడానికి ఎవ్వర్నీ అనుమతించమని సూర్యకాంత్ స్పష్టం చేశారు.
‘దీన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తుల నుంచి కూడా అనేక కాల్స్ వచ్చాయని చెప్పారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ సెక్షన్పై ఆందోళన వ్యక్తం చేశారు. 8వ తరగతి విద్యార్థులకు ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ గురించి బోధించడాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు, రాజకీయ నాయకుల్లో అవినీతి గురించి ఎన్సిఇఆర్టి ఎందుకు బోధించడం లేదని ప్రశ్నించారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ సెక్షన్ ఉన్న పుస్తకాన్ని మార్కెట్ నుంచి తొలగించినట్టు విద్యా శాఖ బుధవారం తెలిపింది. కాగా, గత కొన్ని ఏండ్లుగా ఎన్సీఈఆర్టీ చర్యలు తరచుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. పాఠ్యాంశాల్లో కొన్ని తొలగింపులు, చేర్పులతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి చెందిన పాఠ్యాంశాల్లో ఎన్సీఈఆర్టీ చేస్తున్న మార్పులు, చేర్పులే వివాదాలకు కారణంగా మారుతుండటం గమనార్హం. ఉదాహరణకు 7వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి గ్రీన్హౌస్ ప్రభావం, వాతావరణ మార్పులు వాతావరణ వ్యవస్థలకు సంబంధించిన సూచనలు తొలగించడం వివాదంగా మారింది. అలాగే, 8వ తరగతి పుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్, నూర్జహాన్, రజియా సుల్తాన్లకు చెందిన విభాగాన్ని, ఆంగ్లో-మైసూర్ యుద్ధాన్ని తొలగించడంపై అనేక విమర్శలు వచ్చాయి.



