– ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల
– జీఓ-9 రద్దు చేయాలి
నవతెలంగాణ – కామారెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలోనూ సుమారు 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అందాల్సిన రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికీ విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వివిధ చర్యలు చేపడుతోందని, అందుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ-9 నిదర్శనమని పేర్కొన్నారు.
జీఓ-9ను తక్షణమే రద్దు చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో అమలైన విధంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో జూలై 15న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో వినోద్, ప్రకాష్, రవి, సురేష్, రాజు, ప్రశాంత్, నవీన్, మున్నా, వినయ్, అక్షయ్, రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



