ఈ దోపిడీకి కారణం ఆయనే
అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాల్సిందే
కేటీఆర్, హరీశ్రావు స్థాయి ఏంటీ?
కాంగ్రెస్ అప్పు రూ.1.77 లక్షల కోట్లు
బీఆర్ఎస్ అప్పులు, వడ్డీలు కలిపి రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాం
అబద్ధాలతో విషప్రచారం ఇంకెంత కాలం
సింగరేణి బొగ్గుపై సమ్రగ నివేదిక
ఇవ్వండి : విజిలెన్స్ డైరెక్టర్కు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అప్పు రూ.8,21,651 కోట్లని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ అప్పులపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీకి కారణం ఆయనేనన్నారు. కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పడానికి వారి స్థాయి ఏంటని ప్రశ్నించారు. ఎవరు ఏంటనేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించారనీ, స్థాయి అనేది పుట్టుకను బట్టి రాదనీ, ప్రజాజీవితంలో పోషించే పాత్రను బట్టి వస్తుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్లపాటు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్రావు అప్పులపై అబద్ధ పు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. 2014 నుంచి 2023 వరకు రూ.8,21,651 కోట్ల అప్పు చేస్తే కేటీఆర్ మాత్రం రూ.2.78 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. అబద్ధాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకుని, ‘గోబెల్స్’ ప్రచారానికి పాల్పడు తున్నారని దుయ్య బట్టారు. అబద్ధాల పునా దుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమనీ, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అప్పులు, వడ్డీలు కలిపి
రూ.2.08 లక్షల కోట్లు చెల్లించాం
ఈ రెండున్నరేండ్లలోనే ప్రజాప్రభుత్వం రూ.1.77 లక్షల కోట్ల అప్పు చేసిందని భట్టి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల కు రూ.2,08,681 కోట్లను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు చెల్లించిందని భట్టి వెల్లడించారు. కేవలం రూ.మూడు లక్షల కోట్లే అప్పు చేశామని కేటీఆర్, హరీశ్రావు అబద్ధా లు చెప్తే ఎలా? అని ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ ఖాతాల నుంచి కట్టిన భారీ మొత్తం దేనికో వారే సమాధానం చెప్పా లని సవాల్ విసిరారు. భవిష్యత్ లోనూ కేసీఆరే మళ్లీ వస్తారని కేటీఆర్, హరీశ్రావు అంటు న్నారని, అలాంటప్పుడు మధ్యలో వారు చేసే ఈ హంగామా దేనికోసమని ప్రశ్నిం చారు. వారికి గతం లేదు, భవిష్యత్ లేదు, కనీసం నైతి కత అయినా ఉండాలి కదా? అని అన్నారు.
అప్పు భారం తగ్గించాం
బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ బ్యాంకుల వద్ద 10 శాతం నుంచి 10.5 శాతం వరకు భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుభారం వేసిందని భట్టి చెప్పారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఆ అప్పులను డెబిట్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలోకి తెచ్చిందన్నారు. దీనివల్ల 2025-26 నుంచి 2031-32 మధ్య కాలంలో చెల్లించాల్సిన రూ. 34,058 కోట్ల రుణ భారాన్ని, రూ.11,915 కోట్లకు తగ్గించామని వివరిం చారు. దీని ద్వారా రాష్ట్రానికి రూ.22,142 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చిన వారు, ఇలాంటి ఆర్థిక నిర్వహణపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సింగరేణిపై విషప్రచారం ఆపండి!
సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని భట్టి తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, వనరులు రాష్ట్రానివని వివరించారు. ”పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి కొత్తగా ఒక్క కోల్ బ్లాక్నైనా తెచ్చారా? కనీసం ఉత్పత్తి అయిపోయి మూతపడిన మైనింగ్ బ్లాకులకు బదులుగా కొత్తవి ప్రారంభించారా” అని సూటిగా ప్రశ్నించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను భారీగా విస్తరించిన కేసీఆర్ ప్రభుత్వం, వాటికి అవసరమైన బొగ్గు గనులను మాత్రం ఎందుకు సమకూర్చలేదని నిలదీశారు. కేంద్రం వేలం వేసిన కోల్ బ్లాకుల్లో పాల్గొని సింగరేణికి ఆ గనులను ఎందుకు దక్కించలేకపోయారని ప్రశ్నించారు. సింగరేణికి గనులు వస్తే రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయం తెలంగాణకే చెందేదని అన్నారు. రాష్ట్రంలో బొగ్గు కొరత సృష్టించి, విద్యుత్ ప్రాజెక్టులను సంక్షోభంలోకి నెట్టడమే బీఆర్ఎస్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. సింగరేణి కాలరీస్లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్త వమన్నారు. సింగరేణి అస్తిత్వం, కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న దుష్ప్రచారమని చెప్పారు. సింగరేణి సంస్థలో ఎటువంటి అక్రమాలకు తావులేదనీ, సంస్థ భద్రత కోసం అత్యున్నత స్థాయి జియో-ఫెన్సింగ్ వ్యవస్థ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క కిలో బొగ్గు కూడా మాయం కావడానికి అవకాశం లేన్నారు.
సింగరేణి బొగ్గు మాయం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని విజిలెన్స్ డైరెక్టర్ను భట్టి ఆదేశించారు. కోయగూడెం, సత్తుపల్లి-3 వంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శిం చారు. వాటిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్ట డంలో కేసీఆర్ సర్కార్ పాత్ర ఉందన్నారు. దాదాపు 65 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి-3 బ్లాకును ప్రయివేటు వారికి ఎందుకిచ్చారని ప్రశ్నిం చారు. సింగరేణిని ఆర్థికంగా దెబ్బతీసి, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత సృష్టించి, ప్రయివేటు వ్యక్తుల నుంచి బొగ్గు కొనుగోలు చేయాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని ఆరోపించారు. గత పదేండ్లలో ఇరిగేషన్, రోడ్ల నిర్మాణాల పేరుతో ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో పిల్లలు తినే ఆహారానికి గానీ, వారి కాస్మోటిక్ ఛార్జీలకు గానీ రేట్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. డైట్ ఛార్జీలను ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు పెండింగ్లో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. పిల్లల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచామన్నారు. నాణ్యత తో కూడిన దుస్తులు, షూస్, పుస్తకాలను ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శ కంగా అందిస్తు న్నామని వివరించారు. టెండర్ విలువ రూ. 1,142 కోట్లు ఉంటే, రూ.రెండు వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మా పిల్లలు మఫత్లాల్ బట్టలు, షూ వేసుకోవద్దా? : అడ్లూరి
గురుకులాల్లో చదివే పిల్లలు మఫత్లాల్ బట్టలు, షూ వేసుకోవద్దా? అని హరీశ్రావును మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రశ్నించారు. పారదర్శకంగా ఉండేందుకు రూ.1,42 కోట్లకు గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ టెండర్ పిలవలేదని చెప్పారు. హరీశ్రావు చెప్పినట్టు రూ.రెండు వేల కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగిందన్నారు. అది జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమనీ, మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఫోన్ ఎత్తలేదని కొందరు దూష్ప్రచారం చేశారని అన్నారు. తాను పిరికివాడి, భయపడే వ్యక్తిని కాదన్నారు. అధికారిక కార్యక్రమంలో ఉన్నందు వల్లే ఫోన్ ఎత్తలేదని చెప్పారు.



