పదేండ్లలో బీఆర్ఎస్ అప్పురూ.4.17 లక్షల కోట్లే
మంత్రి జూపల్లికి హరీశ్రావు బహిరంగలేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ లెక్కలకు కట్టుబడి ఉంటాననీ, ఎక్కడైనా చర్చకు సిద్దమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ రాశారని వివరించారు. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాఇ జూన్ 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీశ్రావు శుక్రవారం బహిరంగలేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బీఎం, అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,47,294 కోట్లని స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. తమ లెక్కల ప్రకారం సుమారు రూ.4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా ఈ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమేనని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోవాలనీ, ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.



