నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఘటన
నవతెలంగాణ-డిచ్పల్లి
కొన్నేండ్లుగా మత్తుకు, మద్యానికి బానిసైన కొడుకుకు తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా వినకపోగా, బయట ఇతర అనేక గొడవలకు కారణమవుతున్నాడని విసుగు చెందిన తండ్రి కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, ఎస్హెచ్ఓ జి.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లి గ్రామానికి చెందిన కొత్తగుళ్ల భాను ప్రకాష్ (22) మత్తుకు, మద్యానికి అలవాటు పడ్డాడు. డబ్బుల విషయమై తరచూ తన తండ్రి కొత్తగుళ్ల కిషన్తో గొడవ పడేవాడు. బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.
కోపంతో కిషన్ ఇంట్లో ఉన్న గొడ్డలితో భాను ప్రకాష్ మెడపై దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆయన పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కిషన్కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా.. హత్యకు గురైన భాను ప్రకాష్ చిన్న కుమారుడు. కుటుంబాన్ని పోషించడానికి బతుకుదెరువు కోసం గతంలో గల్ఫ్కు వెళ్లి తన కూతురు వివాహం చేశాడు. చేతికొచ్చిన కుమారుడు చేజేతులా మత్తుకు అలవాటు పడి.. ఎంతచెప్పినా మారకపోవడంతో తండ్రి కిషన్ మదనపడుతూనే కన్న కొడుకును కడతేర్చాడని గ్రామస్తులు తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మత్తుకు, మద్యానికి బానిసైన కొడుకును నరికి చంపిన తండ్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



