అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో బాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం అమలుపై గురువారం హైదరాబాద్లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. గతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం, సర్పంచ్లు లేకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగలేదని మంత్రి చెప్పారు.
నిధులు, ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున అధికారులు కష్టపడితే గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదిక రూపంలో విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటిని వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామ సభల్లో తీర్మానాలు చేయించాలని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది గ్రామాల్లో ఉండి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు అందుతున్నాయా? అనర్హులకు అందుతున్నాయా? అనే అంశాలను పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్ విధానాల రూపకల్పనకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేరళలో కడు పేదరికాన్ని తగ్గించేందుకు ఇలాంటి సమాచార సేకరణ ఎంతో ఉపయోగపడిందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో బాగంగా చేపట్టిన పనులపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఫీల్డ్ వర్క్తో పాటు పేపర్ వర్క్ కూడా సమర్థవంతంగా చేయాలనీ, ఏ విషయంలో నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.



