– 300 మిలియన్ డాలర్ల నష్టం
– ఎక్కడా వెనక్కి తగ్గని టెహ్రాన్
వాషింగ్టన్ : ఇరాన్ జరిపిన దాడిలో గల్ఫ్లోని అమెరికాకు చెందిన కీలక రాడార్ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో అమెరికాకు 300 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. గల్ఫ్లోని అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఈ రాడార్ సూచనలు అందిస్తుంటుంది. ఇరాన్ వైపు నుంచి గల్ఫ్ పైకి వచ్చే దాడులను ఎదుర్కోవాలంటే ఈ రాడార్ సాయం ఎంతో అవసరమని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉపయోగిస్తున్న రాడార్ను, దానికి సంబంధించిన పరికరాలను జోర్డాన్లోని మువాఫక్ సల్తీ వైమానిక స్థావరం వద్ద ఇరాన్ ధ్వంసం చేసిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ గతంలోనే తెలియజేసింది. ఆ తర్వాత దానిని అమెరికా అధికారి ధ్రువీకరించారు. జోర్డాన్లో గత నెల 28న, ఈ నెల 3న ఇరాన్ దాడి చేసింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడులలో థాడ్ రాడార్పై జరిపినదే అత్యంత విజయవంతమైనదని ఓ నిపుణుడు వ్యాఖ్యానిం చారు. అయితే అమెరికా సైన్యానికి, దాని మిత్రులకు మరికొన్ని రాడార్లు కూడా అందుబాటులో ఉన్నాయని, అవి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తాయని ఆయన తెలిపారు. థాడ్ రాడార్ ధ్వంసం కావడంతో క్షిపణులను అడ్డుకునే బాధ్యత ఇప్పుడు పాట్రియట్ వ్యవస్థలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఎనిమిది థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కో వ్యవస్థ ఖరీదు బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఇందులో రాడార్ ఖరీదు 300 మిలియన్ డాలర్లు.
పొరుగు దేశాలకు లొంగిపోయిన ఇరాన్ : ట్రంప్
మధ్యప్రాచ్యంలో ఇరాన్ పరాజితగా మిగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయిల్ దళాలు నిరంతరాయంగా చేస్తున్న దాడుల కారణంగానే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారని, ఇకపై దాడులు చేయబోమని అన్నారని తెలిపారు. ఇరాన్ గతంలో ఎన్నడూ ఇంతలా పరాజయం పొందలేదని అన్నారు.
అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకుంటాం : శ్రీలంక
ఇరాన్ నౌక నుంచి రక్షించిన సిబ్బంది విషయంలో అంతర్జాతీయ చట్టం ప్రకారమే నడుచుకుంటామని శ్రీలంక తెలిపింది. సిబ్బందిని ఇరాన్కు అప్పగించవద్దంటూ అమెరికా ఒత్తిడి తెస్తోందని వస్త్తున్న వార్తల నేపథ్యంలో శ్రీలంకకు చెందిన ఓ మంత్రి ఈ వ్యాఖ్య చేశారు. కాగా ఇజ్రాయిల్, అమెరికా దళాల దాడిలో ఇరాన్ ప్రజలు పెద్ద సంఖ్య లో ప్రాణాలు కోల్పోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు ఫోన్ చేసి మాట్లాడారు. సుప్రీం నేత ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, సైనికాధికారులు చనిపోవడంపై పుతిన్ సంతాపం వ్యక్తం చేస్తూ యుద్ధానికి వెంటనే స్వస్తి చెప్పి సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం సాధించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు.
అమెరికా రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



