Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐను సమర్థవంతంగా వినియోగించాలి

ఏఐను సమర్థవంతంగా వినియోగించాలి

- Advertisement -

పోలీసు శాఖకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపు
తెలంగాణ పోలీస్‌ రిట్రీట్‌-2026ను ప్రారంభించిన మంత్రి : పాల్గొన్న డీజీపీ శివధర్‌రెడ్డి, మాజీ డీజీపీలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

మారుతున్న కాలానికి అనుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను పోలీసు శాఖ సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ఆదివారం నాడు ‘తెలంగాణ పోలీస్‌ రిట్రీట్‌-2026’ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సమయంలో రాష్ట్రంలో తీవ్రవాదం విస్తృతంగా ఉండేదన్నారు. పోలీసు అధికారుల అలుపెరగని కృషి, త్యాగాలతో నేడు తీవ్రవాదం అంతమైందన్నారు. సెలవులు కూడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ, ఎందరో అధి కారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. వారి సేవలకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని కొనియాడారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసింగ్‌ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్‌ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ప్రజలకు వాస్తవంగా న్యాయం చేస్తున్నామా? లేదా? అని స్వీయ విమర్శ చేసుకోవాలని మంత్రి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు నమ్మకం కలిగించినప్పుడే వ్యవస్థకు గుర్తింపు వస్తుందన్నారు. ఈ రెండు రోజుల రిట్రీట్‌ ద్వారా సమీక్షించుకుని, తెలంగాణ పోలీస్‌ శాఖకు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆయయన ఆకాంక్షించారు.
తెలంగాణ డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి మాట్లాడుతూ… రిట్రీట్‌లో జరిగే చర్చలు వాస్తవికతకు దగ్గరగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పోలీసుశాఖ లో చేపట్టాల్సిన సంస్కరణలపై మేధోమథనం జరగాలన్నారు. ఓపెన్‌ ఫోరంలో అధికారులు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అధికారులను ఆరు గ్రూపులుగా విభజించినట్టు తెలిపారు. వివిధ అంశాలపై లోతైన చర్చలు జరిపి నివేదికలు రూపొందిస్తామని వివరించారు.

మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జనాభా పెరుగుతున్న నిష్పత్తికి తగ్గట్టు సిబ్బంది నియామకం ఎప్పుడూ సాధ్యపడదని, అందుకే అందుబాటులో ఉన్న వనరులతోనే పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో యోచించాలన్నారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ పోలీస్‌ అగ్రస్థానంలో ఉందని, ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరో మాజీ డీజీపీ హెచ్‌.జె. దొర మాట్లాడుతూ.. అధికారులు తమ అనుభవాలను రంగరించి శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌, శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేశ్‌ ఎం భగవత్‌, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీపీ అనిల్‌ కుమార్‌, ‘ఈగల్‌’ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, సైబరాబాద్‌ సీపీ డాక్టర్‌ ఎం. రమేశ్‌ సహా పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.
కాగా ఈ పోలీస్‌ రిట్రీట్‌ను ఉమ్మడి ఏపీలో అప్పటి డీజీపీ హెచ్‌.జె దొర.. పోలీసు శాఖకు నాయకవత్వం వహించే ఐపీఎస్‌ అధికారులకు రిట్రీట్‌(పున:శ్చరణ) కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించారు. ఏడాది కాలంలో ఐపీఎస్‌ అధికారులు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలు, నూతన సవాళ్లు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొనడానికి పోలీసులు అందించాల్సిన సేవలు తదితర అంశాలపై ఈ రిట్రీట్‌ను నిర్వహించేవారు. అందుకోసం రిట్రీట్‌లోనే అధికారులతో అంతర్గత కమిటీలను వేసి, ఆయా అంశాలపై ఆ కమిటీలు చర్చించి చేసిన సిఫారసులను అమలు చేసే విషయమై దృష్టిని సారించేవారు. తాజాగా అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐపీఎస్‌ల రిట్రీట్‌ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. సోమవారం రిట్రీట్‌ ముగింపు సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -