దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
తెలంగాణలో ఉద్యోగాల కోసం 45 లక్షల మంది వేట
జాబ్ క్యాలెండర్ భేష్…
నో రిక్రూట్మెంట్స్ నిరుద్యోగభృతిపై నో కామెంట్
అమలుకాని బిశ్వాల్ కమిటీ నివేదిక
కేంద్రంలో 10 లక్షల ఖాళీ పోస్టులు
రాష్ర్టంలో 2 లక్షల ఖాళీలు భర్తీల ఊసెత్తని ప్రభుత్వాలు
పత్తాలేని రాజీవ్ యువ వికాసం గిగ్ వర్కర్లుగా నిరుద్యోగుల బతుకులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాలను బహిర్గతం చేశాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వివిధ పేర్లతో ఆయా పనులు చేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికగా, అతి తక్కువ వేతనాలతో ఉద్యోగులను నియమించు కుంటున్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిసినా, కేంద్రం అదే తోవలో పయనిస్తోంది. మరికొన్ని శాఖల్లో ఉన్న సిబ్బందిపైనే పనిభారం తీవ్రంగా ఉంది. కేంద్రంలో 2023 జులై 1 నాటికి 9.64 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని స్వయంగా ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం కేంద్రంలోని సివిలియన్ పోస్టుల శాంక్షన్ పోస్టులు మొత్తం దాదాపు 40 లక్షలు. వాటిలో లక్ష ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. అయినా2026 నాటికి మళ్లీ ఖాళీ పోస్టుల సంఖ్య 10 లక్షలకు పెరిగింది. వీటిని ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రతిపక్షాలు నిలదీస్తే, మోడీ సర్కార్ సమాధానాలు చెప్పట్లేదు.
రాష్ర్టంలోనూ…
రాష్ర్టంలోనూ నిరుద్యోగ పరిస్థితులు భిన్నంగా ఏమీ లేవు. ఇక్కడా దాదాపు 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లీక్ సర్వీస కమిషన్(టీజీపీఎస్సీ) వన్ టైమ్ రిజస్ట్రేషన్ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టిన వారే 35 లక్షల మంది ఉన్నారు. రిజిస్ర్టేషన్ చేసుకోని వారు మరో 10 లక్షల మంది ఉంటారని అంచనా. మొత్తంగా రాష్టంలో 45 లక్షల మందికిపై యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. టీజీపీఎస్పీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో డిగ్రీ, ఇంటర్,పదో తరగతి చదివినవారు ఉన్నారు.
ఇచ్చింది 59,567 ఉడ్యోగాలే
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. ఉన్నత చదువులు చదివిన యువ నిరుద్యోగులు స్వీగ్గి, జోమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో రైడర్లుగా మారి గిగ్వర్కర్లుగా పనిచేస్తున్నారు. మరికొందరు క్యాటరింగ్ వర్కర్ల అవతారమెత్తుతున్నారు. ఇంకొందరు ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత రాజధాని హైదరాబాద్లోని అశోక్నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తున్నది. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 59,567 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. వీటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల కొనసాగింపు పోస్టులు పోనూ, కాంగ్రెస్ సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 13 వేలు మాత్రమే. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి రూ. 4000 హామీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.
బిస్వాల్ నివేదిక బేఖాతర్
బిస్వాల్ కమిటీ పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయి. ఏటా దాదాపు 9వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. ఫలితంగా ఖాళీ పోస్టుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమల్లో లేదు. దానిప్రకారం ప్రభుత్వ నియామకాలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. దీనిపై యువతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
జీవో 46 రద్దు కాలే
పోలీస్ శాఖకు చెందిన జీవో 46ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ గతంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి మూడండ్లు అవుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యల్లేవు. ఈ శాఖలో 19 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 7437 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం పలురూపాల్లో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయి.
మంత్రివర్గంలో చర్చే లేదు
రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాలను రెగ్యులర్గా నిర్వహిస్తున్నది. గడచిన మూడేండ్లలో నిరుద్యోగ సమస్యను మంత్రివర్గంలో పూర్తిస్థాయిలో చర్చించిన దాఖలాలు లేవు. దీనిపై నిరుద్యోగులు త్రీవ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వచ్చిన యువకులు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు చెల్లిస్తూ నిరుత్సాహంతో నిరసనల మధ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గంలో తప్పనిసరిగా ఖాళీ పోస్టుల భర్తీని అజెండాగా తీసుకొని చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
యువ వికాసం దరఖాస్తులు 16 లక్షలు
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రాజీవ్ యువవికాసం పథకమొకటి. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 16.23 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. 2024 బడ్జెట్లో రూ.6000 కోట్లు, 2025 బడ్జెట్లో రూ. 6000 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు అసలు ఆ పథకాన్నే చేపట్టలేదు. కొన్ని పథకాలకు నిధుల్లేక మూలన పడుతుంటే, కేటాయింపులు ఉన్నా చేపట్టని పథకంగా రాజీవ్ యువవికాసం మిగిలింది.
పోస్టుల భర్తీ ఇలా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా శాఖల్లో పోస్టులు భర్తీ చేసింది. డిఎస్సీ 5973, గ్రూప్-1 60, జ్యూడిషియరీ 277, ల్యాబ్టెక్నిషియన్ 1284, నర్సులు 2050, ఫార్మాసిస్టులు 633, ఆర్టీసీ 1743, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు 20, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 24 పోస్టుల వరకూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చిన వాటిని ఈ సర్కారు రిక్రూట్ చేసింది.
జాబ్క్యాలెండర్ ఏమైంది… బి.ఉపేందర్, నిరుద్యోగి
ప్రభుత్వం నిరుద్యోగులకు హామీ నిచ్చినట్టు జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించేవరకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. యూత్ డిక్లరేషన్ను మరి చిపోయారు. స్వయం ఉపాధిని పొంc దేందుకు రుణాలు ఇవ్వడం లేదు. దరఖాస్తులు తీసుకుని కంప్యూటర్లల్లో నిక్షిప్తం చేసుకున్నా రు. అంతే తప్ప ఉద్యోగాల కల్పన ఎండమావే అయింది.
హామీలు అమలు చేయలేదు ఆనగంటి వెంకటేష్,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిరాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు భారీ ఆశలుపెట్టుకున్నారు.
వాటిని నెరవేర్చుకోవడం కోసమే యువతరం కాంగ్రెస్
పక్షాన నిలిచింది. కానీ అధికారంలోకి వచ్చాక వారి ఆశలు నీరుగారుతున్నాయి. ప్రభుత్వ హామీలు ఏవీ పట్టాలెక్కడం లేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల మాట మరిచిపోయారు.నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. బిస్వాల్ కమిటీని పట్టించుకోలేదు. రాజీవ్ యువ వికాసం మాటే లేదు. దరఖాస్తులను స్వీకరించి పెండింగ్ లో పెట్టారు. వీటికోసం ఇప్పటికే పలురూపాల్లో ఆందోళనలు చేశాం. సచివాలయాన్నీ, అసెంబ్లీని ముట్టడించాం. అయినా సర్కారులో చలనం లేదు. మొత్తం ఖాళీలను భర్తీచేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది.



