– సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్
– ఎస్ఐఆర్ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్
నవతెలంగాణ-సత్తుపల్లి
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఫారాల డిజిటైజేషన్ అత్యంత కీలకమని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అధికారులు, బీఎల్ఓలను స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పురోగతిపై సబ్-కలెక్టర్ అజయ్ యాదవ్ సోమవారం సత్తుపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ బూత్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 186, 223 లతో పాటు, గంగారం, బేతుపల్లి గ్రామాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 239, 241, 297 లలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను సబ్ కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కంప్యూటరీకరణ పనుల వేగం, నాణ్యత, డేటా కచ్చితత్వాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ మాట్లాడుతూ..నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ 100 శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్వోలను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా సకాలంలో డిజిటైజేషన్ పూర్తి చేయాలని కోరారు. ఎస్ఐఆర్ పరిశీలన కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం సూపర్వైజర్లు, బీఎల్వోలు, ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.



