నవతెలంగాణ – కామారెడ్డి : యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నతమైన కెరీర్ వైపు నడిపించేందుకు ‘మై భారత్’ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి రమేష్, ఆర్.కే. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పోటీల ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యూత్ ఆఫీసర్ రంగా వెంకటేశ్వర్ గౌడ్, ఆర్.కే. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) కార్యక్రమాధికారులు అంజయ్య, హరిత పాల్గొన్నారు. ఈ పోటీల్లో జానపద గీతాలు, జానపద నృత్యాలు, లఘు వీడియోలు, స్వల్ప చిత్రాలు, నాటకం, కవితా రచన, వాదోపవాదాలు, నినాద రచన, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పోటీలు జూలై 31న ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ఆర్.కే. డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ యువశక్తిని దేశ నిర్మాణానికి ఎలా వినియోగించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు జూలై 31 ఉదయం 10 గంటలలోపు సెమినార్ హాల్కు చేరుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలోని విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



