– ఈద్గా వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, స్వయంగా బందోబస్తును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఈద్గా మైదానానికి చేరుకున్న ఎస్పీ బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రార్థనలు క్రమశిక్షణతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలని పిలుపునిచ్చారు.
భక్తుల రాకపోకలు పూర్తిగా ముగిసే వరకు బందోబస్తు కొనసాగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, ఎస్ఐలు, ముస్లిం సోదరులు ప్రజలు పాల్గొన్నారు.



