తప్పిదాలను రోల్బ్యాక్ సాయంతో సవరించాలి :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్టంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియపై అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాల్లో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. గైర్హాజరు, నివాసం మార్పు, మరణించిన, నకిలీ (ఏఎస్డీడీ) ఓటర్ల జాబితాల పునఃపరిశీలన, విశ్లేషణ, మ్యాపింగ్ కాపోవడం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించకూడదని స్పష్టం చేశారు. లోపాలు గుర్తించిన సందర్భంలో రోల్బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి అవసరమైన సవరణలు చేయాలని ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ), బూత్ లెవల్ సూపర్వైజర్లు (బీఎల్ఎస్), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓ) క్షేత్ర స్థాయిలో నిబద్దతతో పని చేయా లన్నారు. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సమా వేశాల మినిట్స్ను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సిద్ధం చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. 85 సంవత్సరాల వయస్సు గల ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి ఎన్. శంకర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జిఎస్. చారి, జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావులేకుండా ‘సర్’ డిజిటలైజేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



