స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కేంద్రం రద్దు చేయాల్సిందే
సీటూ+50 శాతం ఎమ్ఎస్పీ ఇవ్వాలి
దేశవ్యాప్తంగా సమగ్ర రుణమాఫీ చేయాలి
విద్యుత్ ప్రయివేటీకరణను రద్దు చేయాలి : పోస్టరావిష్కరణలో ఎస్కేఎం నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలనీ, పంటలకు సీటూ+50 శాతం పద్ధతిలో కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్యపద్మ, జక్కుల వెంకటయ్య, చంద్రారెడ్డి, భాస్కర్, తుకారాం నాయక్ డిమాండ్ చేశారు. సమగ్ర రుణమాఫీ చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ ప్రయివేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ప్రధాన డిమాండ్లుగా ఈ నెల పదో తేదీన ఎస్కేఎం ఆధ్వర్యంలో జైల్భరో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించి సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలోని రాజ్బహదూర్ గౌడ్ హాల్లో జైల్భరో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు నష్టదాయకంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, రోజువారీగా రూ.700 వేతనమిచ్చి ఉపాధి కూలీలకు 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. విత్తన బిల్లు-2025, ఎన్ఎఫ్ఎస్ఏ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. కార్పొరేట్ల ప్రయోజనాలు, లాభాల కోసం ఆదివాసీ గిరిజనులు, పేదలు, రైతుల నుంచి బలవంత భూసేకరణ చేయొద్దని హెచ్చరించారు. ఈ నెల పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ‘జైల్ భరో’, ‘రైల్ రోకో’, ‘రోడ్ రోకో’ వంటి కార్యక్రమాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎస్కేఎమ్ ఆధ్వర్యంలో రాబోయే రెండు నెలల్లో పాదయాత్రలు, వాహన జాతాలు , ట్రాక్టర్ ర్యాలీలు, మహా పంచాయతీలు, బహిరంగ సభల వంటి స్వతంత్ర, సమన్వయ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం ఉల్లంఘించడాన్ని కొనసాగిస్తే దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎల్నినో నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థలతో కూడిన సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు విజయ్, శివకుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
10న జైల్భరో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



