గుమ్మడి విట్టల్రావు (గద్దర్) భౌతికంగా మన మధ్య లేక మూడేండ్లు పూర్తయినా, ఆయన స్వరం మాత్రం మౌనమవ్వలేదు. ఆయన పాటలు, భావజాలం, ప్రజలతో మమేకమైన జీవితం ఇప్పటికీ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రజల బాధను పాటగా, పాటను పోరాటంగా, పోరాటాన్ని చరిత్రగా మలిచిన అరుదైన ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై, నక్సల్బరీ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దళిత-బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో ఊపిరి పోశారు. ‘బండెనక బండి కట్టి…’, ‘భద్రం కొడుకో…’, ‘మదన సుందరి…’, ‘భారతదేశం భాగ్యసీమరా…’, ‘దళిత పులులమ్మా…’, ‘అడవి తల్లికి వందనం…’ ‘మల్లె చెట్టుకు పందిరివోలె ’ వంటి వందలాది పాటలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆలపించిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా… పోరు తెలంగా ణమా…’ అనే గీతం ఉద్యమానికి అపూర్వ మైన సాంస్కృతిక శక్తిని అందించింది. ఆ పాట అనంతరం తెలంగాణ ఉద్యమం మరింత వేగం పుంజుకుందని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజామాబాద్, హైదరాబాద్లలో విద్యాభ్యాసం చేసిన గద్దర్, కొంతకాలం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసినప్పటికీ, ప్రజా ఉద్యమాలే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నారు.
1971లో దర్శకుడు బి. నరసింగరావు ప్రోత్సాహంతో రచించిన ‘ఆపర రిక్షా’ ఆయన తొలి పాట. అనంతరం విడుదలైన తొలి ఆల్బమ్ ‘గద్దర్’ ఆయనకు శాశ్వత నామధేయంగా మారింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్పై జరిగిన హత్యాయత్నం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సంచలనాత్మక ఘటన. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయాలని ప్రయత్నించినప్పటికీ, మరణం అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. శరీరంలో బుల్లెట్తోనే జీవితాంతం జీవించినా, ఆయన స్వరం మాత్రం మరింత శక్తివంతమైంది. హత్యాయత్నం అనంతరం గద్దర్ కేవలం గాయకుడిగానే కాకుండా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షకుడిగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. 1990ల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు వేలాది సభల్లో ఆయన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. గ్రామాల నుంచి నగరాల వరకు ‘శబ్దం’ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నాటారు. జిల్లాల వారీగా సాం స్కృతిక బృందాలను ఏర్పాటు చేసి, పాటలు, నాటికలు, సభల ద్వారా ఉద్యమాన్ని సామాన్య ప్రజల జీవితంలో భాగం చేశారు.నీటి పంపిణీలో అన్యాయం, ప్రాంతీయ అసమానతలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, కుల వివక్ష, వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ఆయన పాటలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.
గద్దర్ జీవితమంతా పోరాటమే. విప్లవ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు 2004లో అప్పటి ప్రభుత్వం-పీపుల్స్ వార్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచనలను విస్తరించుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల నిర్మూలన, ప్రజాస్వామ్య హక్కుల కోసం తన గళాన్ని నిరంతరం వినిపించారు. జీవితాంతంలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ విలువలు, అణగారిన వర్గాల సాధికారతపై ఎక్కువగా దృష్టి సారించారు. ‘భారత్ జోడో’ యాత్రలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరాన్ని ప్రజల్లో చాటిచెప్పారు. మణిపూర్ హింస, మహిళలపై దాడులు, క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, బిల్కిస్ బానో కేసు వంటి మానవ హక్కుల అంశాలపై కూడా తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ప్రజల బాధను స్వరంగా, స్వరాన్ని ఉద్య మంగా, ఉద్యమాన్ని చరిత్రగా మలిచిన మహోన్నత ప్రజా కళా కారుడు ఆయన.భౌతికంగా గద్దర్ మన మధ్య లేక పోయినా, ఆయన గళం ఇంకా ప్రజల గొంతుల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన పాటలు ఇంకా ఉద్యమాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే గద్దర్ ఒక శాశ్వత స్ఫూర్తి. మౌనమవ్వని స్వరం.
డాక్టర్ జి.వి.వెన్నెల గద్దర్
డాక్టర్ జి.వి.వెన్నెల గద్దర్



