రూ.10 కోట్లతో స్టేడియం ముస్తాబు
నవతెలంగాణ-హైదరాబాద్
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఉప్పల్ స్టేడియం సరికొత్తగా తయారైంది. అతిథులు, అభిమానులకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు రూ. 10 కోట్లతో స్టేడియానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్గ్రూప్ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్తో స్టేడియంలో ఆధునిక వసతులు కల్పించింది. ఇందులో భాగంగా స్టేడియంలో 46 టాయిలెట్లను ఆధునాతన మార్బుల్స్, కమోడ్స్తో ఆధునీకరించారు. నార్త్, సౌత్ పెవిలియన్స్లో 42 కార్పోరేట్ (హాస్పిటాలిటీ) బాక్స్లను సుందరీకరించారు. లాంజ్ ఏరియాలను వుడెన్ ఫ్లోరింగ్, లెథర్ సీటింగ్తో తీర్చిదిద్దటంతో పాటు ఉష్ణోగ్రతలను నియంత్రలో ఉంచేందుకు 43 కొత్త ఏసీలు అమర్చారు. లాంజ్ ఏరియా, హాస్పిటాలిటీ బాక్స్ల్లో స్టేడియం వ్యూ మెరుగ్గా ఉండేలా డిజైన్ చేశారు. అతిథులు సులువుగా లోపలికి చేరుకునేందుకు కొత్తగా రెండు ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను పంచుకుంది.
ఈ శనివారం సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. సొంతగడ్డపై ఏప్రిల్ 5న లక్నో సూపర్జెయింట్స్తో సన్రైజర్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 తొలి దశలో 20 మ్యాచ్ల షెడ్యూల్నే విడుదల చేశారు. తొలి దశ షెడ్యూల్లో హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. ఓవరాల్గా సన్రైజర్స్ తొలి దశలో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. ఏప్రిల్ 2న ఈడెన్గార్డెన్స్లో కోల్కతా నైట్రైడర్స్తో, 11న ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో ప్రీ సీజన్ సాధన చేస్తున్న సన్రైజర్స్.. గురువారం తొలి మ్యాచ్ కోసం బెంగళూరుకు చేరుకోనుంది.
ఉప్పల్కు కొత్తకళ!
- Advertisement -
- Advertisement -



