కాకలుతీరిన యోధులు కాదు.. రాజకీయాలలో తల పండిన నేతలు కాదు. కానీ సంఘ్ పరివారం కుటిల ఎత్తుగడలను ఛేదించారు. అహంకారం, నియంతత్వం తలకెక్కిన కేంద్రం మెడలు వంచారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసేలా చేసిన ఘనులు జెన్ జీలు. జెన్ జీ ఉద్యమం చారిత్రాత్మకమైనది, సంచలనాత్మకమైనది. ఎలాంటి నిర్మాణం లేని సీజేపీ ఉద్యమానికి నాయకత్వం వహించడం మరో కీలకమైన అంశం. బాధ్యత లేని వారిగా ముద్ర వేయబడిన యువత అత్యంత బాధ్యతాయుతమైన పనిని భుజాన వేసుకొని నిర్వహించిన ఉద్యమం. కట్టుకథల పునాదులపై సంఫ్ు పరివారం నిర్మించుకున్న కోట గోడలను జెన్ జీ ఉద్యమం ధ్వంసం చేసింది. గోడీ మీడియాకే కాదు, మోడీకి కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి కల్పించారు. 2026 జూలైలో భారతదేశంలో జెన్-జీ నేతత్వంలోని ‘కాక్రోచ్’ (బొద్దింక) ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. నీట్ వైద్య ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కుంభకోణం, నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కొరతపై యువతలో పేరుకుపోయిన ఆగ్రహానికి ఇది ఓ నిదర్శనం.
NEET UG పరీక్ష పేపర్ల లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు తిరిగి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ కుంభకోణం వలన 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. పేపర్ లీక్కు బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకు రావాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్స్ ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్స్ను చాలా తేలికగా తీసుకున్నది. కంటితుడుపు చర్యగా టెలిగ్రాం యాప్ను కొంతకాలం నిషేధించి చేతులు దులుపుకున్నది. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం యువతలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నాతో ఉద్యమం మొదలైంది.
పేరు వెనుక కథ : భారత ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’గా పోల్చడంతో ఈ ఉద్యమానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (జజీూ) అనే పేరు వచ్చింది.
ఉద్యమ విజయాలు : ‘మోడీ ఉంటే అన్నీ సాధ్యమే’ అనే ఒక కల్పిత ఇమేజ్ మోడీ చుట్టూ సష్టించబడింది. మోడీ ఎవరికి భయపడడు అని ప్రచారం ఉంది. ఏకపక్ష నిర్ణయాలు, నియంతత్వ పోకడలతో విర్రవీగుతూ, ఊహల్లో విహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నేలమీదకు దించి, కేంద్ర మంత్రిని రాజినామా చేసేలా చేసారు.12 ఏండ్ల మోడీ ప్రభుత్వంలో ఒక కేబినెట్ మంత్రి ప్రజా ఒత్తిడితో రాజీనామా చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఇది యువత సాధించిన పెద్ద విజయం. జెన్ జీ ఉద్యమం అపూర్వంగా వ్యాప్తించింది. ఏడు రోజుల్లో 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 412 నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రతి 24 నిమిషాలకు ఒక నిరసన జరిగింది.
జీర్ణించుకోలేక… : ఈ ఉద్యమంలో ఎవరూ మరణించలేదు. 412 చోట్లకు గాను 328 చోట్ల ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరిగాయి. ప్రభుత్వం అణిచివేతకు పూనుకున్న చోట కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభావవంతమైన ఆన్లైన్ వ్యూహం అమలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్, రీల్స్ ద్వారా ప్రభుత్వాన్ని, సంఘ్ పరివారం సోషల్ మీడియా సైన్యాన్ని డిజిటల్ రంగంలో ఎదుర్కొన్నారు. ప్రధాన మంత్రి కూడా జెన్ జీ డిజిటల్ వ్యూహంతో సరితూగ లేకపోయారు. జెన్ జీ ఉద్యమ దెబ్బకు మోడీ అర్దరాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోపై విపరీతమైన మీమ్స్ వచ్చాయి. మోడీని ఒక జోకర్ స్థాయికి జెన్ జీ యువత తీసుకొచ్చింది. దీనిని కూడా సంఫ్ు పరివారం ట్రోల్ సైన్యాలు జీర్ణించుకోలేక పోతున్నారు. జెన్ జీ ఉద్యమంపై, అందులో పాల్గొన్న ఉద్యమకారులపై సంఘ్ పరివారం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అమ్మాయిలను వేధిస్తున్నారు. జెన్ జీ ఉద్యమంపై ప్రభుత్వం మూడు రకాలుగా స్పందించింది. ఒక వైపు ఉద్యమకారులపై కఠిన చర్యలు, మరోవైపు సానుభూతి ప్రదర్శించినట్లు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు, మూడోవైపు అణచివేత కొనసాగిస్తున్నారు.
కఠిన అణచివేత (Crackdown) : జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యానల్స్, పెల్లెట్ గన్లు ఉపయోగించారు. చిన్న పిల్లలే కదా భయపడి పారిపోతారని ప్రభుత్వం, పోలీసులు తక్కువ అంచనా వేశారు. కానీ పోలీసులు లాఠీలతో కొడుతుంటే పారిపోవడం లేదు, నిర్భయంగా నిలబడి ‘మారో, మారో..’ అంటూ ఎన్ని దెబ్బలు కొట్టినా కదలకుండా నిలబడి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించారు. నీటి ఫిరంగులతో కొడుతుంటే రెయిన్ డ్యాన్స్ చేసి ప్రభుత్వ క్రూరత్వాన్ని కామెడీతో అవహేళన చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగిస్తుంటే గ్యాస్ బాంబులను ఫుట్ బాల్ లాగా తన్నుతూ పోరాటాన్ని ఆటలాగా మార్చారు. తమపై లాఠీలు ప్రయోగించిన పోలీసులకు సైతం ఆహారాన్ని అందించారు. పోరాటం అనేది పోలీసుల మీద కాదు, ప్రభుత్వం మీదనే అనే సందేశం ఇచ్చారు. ప్రభుత్వం చేయించిన దాడిలో 180 మందికి పైగా గాయపడ్డారు. లాఠీ చార్జీలో కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలినా, తలలు పగిలినా హాస్పిటల్కు వెళ్లి కట్లు కట్టించుకొని మళ్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమయ్యారు. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. బీహార్లోని ఓ పోలీసు అధికారి AK-47 రైఫిల్తో కాల్పులు జరిపాడు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సస్పెండ్ చేయబడ్డాడు.
నిజాలు నిగ్గు తేల్చాలి : పోలీసులు కానీ వ్యక్తులు కూడా విద్యార్థులపై దాడులకు పాల్పడినట్లు అనేక వీడియోలు లభిస్తున్నాయి. వారంతా సంఘపరివార్కు సంబంధించిన వ్యక్తులుగా ఆరోపణలు వస్తున్నాయి. నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు అన్నం పెట్టిన ఫుడ్ వాలెంటైర్ జునైద్ను, ఆయన కుటుంబాన్ని వెంటాడి వేటాడారు. కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారు. నిరసనలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థులపై ఎఫ్.ఐ.ఆర్లు నమోదు చేయడం, అరెస్టులు కొనసాగించడం జరుగుతూనే ఉన్నాయి. జెన్ జీ నిరసనకారుల ఇండ్ల వద్దకు వెళ్ళి కుటుంబాలను బెదిరిస్తున్నారు. 15 సంవత్సరాల రుచికా సింగ్ అనే మైనర్ బాలికపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించారు. అమ్మాయిని బెదిరించి మోడీకి క్షమాపణ చెబుతూ వీడియో చేయించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ దిగజారుడు చర్యలకు నిదర్శనం.
డిజిటల్ నిఘా : ఏఐ ఆధారిత నిఘా ద్వారా నిరసనకారులను ట్రాక్ చేసి అరెస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రదర్శనకారుల డేటా సేకరణను అసాంఘికమైనదిగా పిటిషన్ దాఖలైంది. సోషల్ మీడియా నియంత్రణ పెట్టారు. బిట్ చాట్ను నిషేధించారు. జజీూ అకౌంట్ను శ నుండి బ్లాక్ చేశారు. ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యల పేరుతో పోస్టులపై ఎఫ్.ఐ.ఆర్లు, ఖాతాల తొలగింపు చేస్తున్నారు. సెల్ ఫోన్ నెట్వర్క్ లేకుండా చేసారు. అయినా ఉద్యమం కొనసాగింది. చివరకు కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్స్ అంగీకరించారు. కేంద్ర మంత్రుల బృందంతో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. పరీక్షా వ్యవస్థ సంస్కరణకు ప్యానెల్ ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. తర్వాత నిరసనలు ముగించడానికి సీజేపీ అంగీకరించగా, ప్రభుత్వం ఎలాంటి కేసులు ఉండవని, చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి అరెస్టులు కొనసాగించింది. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇది అత్యంత హేయమైనది.
ఉద్యమంపై దుష్ప్రచారం : జెన్ జీ ఉద్యమంపై బీజేపీ ఆధీనంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా సైన్యం, ప్రధానమంత్రితో సహా బీజేపీ నాయకులంతా తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. దేశద్రోహులని, అసాంఘిక శక్తులని.. జెన్ జీ యువత వ్యక్తిత్వం గురించి, ఆ ఉద్యమంలో పాల్గొంటున్న యువతుల పైన ఆర్ఎస్ఎస్ నాయకులు చాలా దిగజారిన కామెంట్స్ చేస్తున్నారు. మతం రంగు, కులం రంగు పులమడానికి కూడా సంఫ్ు పరివారం ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి నిరసనకారులను మతపరంగా నిలబెట్టి మాట్లాడారు. నిరసనలను ‘విదేశీ శక్తుల ప్రేరణ’గా ముద్రవేశారు. ఈ దుష్ప్రచారాన్ని జెన్ జీ యువత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇంకా ఈ దుష్ప్రచారం కొనసాగుతూనే ఉన్నది.
ఉద్యమ ప్రత్యేకత: ‘మీమ్స్ యుద్ధం’ : ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా నిలిపినది హాస్యం, వ్యంగ్యం. పోలీసు లాఠీల మధ్య ఫోన్లలో ‘ఫిట్ చెక్’ వీడియోలు తీయడం, టియర్ గ్యాస్ను ‘రెస్టారెంట్ రివ్యూ’లా విశ్లేషించడం, పోలీసుల ఎదురుగా లిప్స్టిక్ అప్లై చేసుకుంటూ యువతులు నిలబడటం.. ఇది కేవలం వినోదం కోసం కాదు; ‘భయాన్ని ఎదుర్కొనే మార్గం’, ‘మేమక్కడ ఉన్నాం, ఇది జరిగింది, మేం గుర్తుంచుకుంటాం’ అనే సందేశం ఈ మీమ్స్ ద్వారా జెన్ జీ యువత దేశానికి పంపింది.
మూడు కీలక పాఠాలు నేర్పింది : 1. డిజిటల్ యుగంలో యువత శక్తి సోషల్ మీడియా, మీమ్స్ ద్వారా సాంప్రదాయ ప్రభుత్వ యంత్రాంగాన్ని సవాలు చేయగలరు. 2. బలప్రయోగం, అరెస్టులు ఆగ్రహాన్ని అణచివేయలేవు, బదులుగా మరింత తీవ్రతరం చేస్తాయి. 3. సమస్యలు పరిష్కారం కావాలంటే హిందూ, ముస్లిం రాజకీయాల నుండి బయటికి రావాలని యువతరానికి పిలుపునిచ్చింది.
మరింత శక్తివంతంగా… : ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య చర్చ కంటే నిర్బంధం-అణచివేత వైపు మొగ్గు చూపుతోంది. రాజీనామా తర్వాత కూడా కక్షసాధింపు కొనసాగించడం అందుకు తార్కాణం. ఈ ఉద్యమంలోని అత్యంత వివాదాస్పద విషయం కూడా అదే. జెన్ జీ ఉద్యమంలో పాల్గొన్న యువతని, వారి కుటుంబ సభ్యులను బెదిరించడం ద్వారా దారికి తెచ్చుకోవచ్చని సంఘ పరివారం భావిస్తున్నారు. కానీ అది అసాధ్యం, ఎందుకంటే నిరుద్యోగం, అవినీతి, ఆర్థిక, సామాజిక అసమానతల వంటి మూల కారణాలు పరిష్కరించబడకపోతే, ఈ ఉద్యమం మరింత శక్తివంతమైన రూపంలో తిరిగి వస్తుంది.
ఎం.డి అబ్బాస్
9030098032



