– నెలరోజుల పాలనపై సీఎం రేవంత్రెడ్డి ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి, జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన నెల రోజుల ప్రభుత్వ ప్రస్థానం తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ, సాగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్మిలు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని చెప్పారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్య తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకుని, తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ను ముగించారు.