భారత్-శ్రీలంక రెండో టెస్ట్ డ్రా
దినుష అజేయ సెంచరీ
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/9
కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఫాలో ఆన్ ఆడుతూ శ్రీలంక జట్టు చివరిరోజు 9 వికెట్ల నష్టానికి 429 పరుగుల స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన సొనల్ దినుష రెండో ఇన్నింగ్స్లోనూ శ్రీలంకను అజేయ శతకంతో ఓటమినుంచి గట్టెక్కించాడు. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో సొంతం చేసుకుంది. ఓవర్నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 229 పరుగులతో గురువారం ఆటను కొనసాగించిన శ్రీలంకను ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో ఆదుకున్నారు. అసాధారణ బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్ కోసం భారత్ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) వీరోచిత పోరాటం కనబరిచారు. తొమ్మిదో వికెట్గా కుమార అవుట్ కావడంతో శ్రీలంకను భారత్ త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్కు వస్తుందని భావించినా.. పదకొండో నంబర్ బ్యాటర్ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్ కోసం ఆఖరికి కెప్టెన్ శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేశారు. అయినా చివరి వికెట్ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. భారత బౌలర్లు జడేజా, మానవ్ సుతార్కు మూడేసి, ప్రసిధ్, సిరాజ్, సురాన్ష్ జైన్కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొనాల్ దినుషకు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దేవదత్ పడిక్కల్కు లభించాయి.
డబ్ల్యూటిసిలో భారత్ ఇలా..
రెండో టెస్ట్లోనూ భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకొని ఉంటే డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకేది. కానీ ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ ఐదో స్థానంలోనే ఉంది. టీమిండియా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమితో పాయింట్స్ టేబుల్లో ఎగబాకే అవకాశం రాగా.. భారత్ చేజార్చుకుంది. డబ్ల్యూటీసీ 2027 సైకిల్లో భారత్ ఇంకా ఏడు టెస్ట్లు ఆడాల్సి ఉంది. భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన ఏడు టెస్ట్ల్లో ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడు మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ విజయాల శాతం 68.52 శాతానికి చేరుతుంది. అదే 6 విజయాలు, 2 ఓటములు అయితే విన్నింగ్ పర్సంటేజీ 62.96 శాతానికి పడిపోయి 2027 డబ్ల్యూటిసి ఫైనల్ రేసునుంచి నిష్ర్కమించినట్లే.
సంక్షిప్త స్కోర్లు..
భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్



