- Advertisement -
- టీజేఏ, ఎన్యూజే(ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత
- నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ), ఎన్యూజే(ఐ) జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ సెలవులో ఉండటంతో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), ఇన్చార్జి డీపీఆర్వో గిరికి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజాన్ని చైతన్యపరిచే జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని ముద్రణ, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి కుటుంబాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. - అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి జాప్యం లేకుండా మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ప్రతి రెండు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆరోగ్య భద్రత, ఉచిత వైద్య సేవలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని, జర్నలిస్టుల పిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో జరిగే ప్రెస్మీట్లు, అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని జర్నలిస్టులకు సకాలంలో అందించాలని కోరారు. విధి నిర్వహణలో జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురైతే అధికారులు రక్షణ, సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు వి. రాజేందరనాథ్, టీజేఏ జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సీహెచ్, ఉపాధ్యక్షులు ఆమృత్ రావు, కోశాధికారి సుందర్ మోహన్, శ్రీనివాస్రావు, నవీన్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సిద్ది రాములు, టీజేఏ సభ్యులు ఫర్వేజ్, రేణుకుమార్, బిక్కనూర్ సాయులు, కమ్మరి నవీన్, కుమ్మరి ఎల్లన్న, రామ్మూర్తి, కడెం భైరయ్య, టీ. సాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



