– ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రామకృష్ణ
– మహాసభల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిమ్మటూరి రామకృష్ణ కోరారు. మహాసభల విజయవంతం కోరుతూ మంగళవారం గంగారం, రామానగరం గ్రామాల్లో ‘బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్’ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆయన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని ఈ సందర్భంగా రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మహాసభలకు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని, కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. కార్మికులకు భవిష్యత్తులో కష్టకాలం రానుందని, ఇప్పటికైనా ప్రమాదాన్ని గుర్తించి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి 12 ఏళ్లు దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారాదత్తం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.
అసంఘటిత రంగ స్కీమ్ వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు క్లెయిమ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సమితి సభ్యులు బుగ్గ సుధాకర్, సీపీఐ మండల కార్యదర్శి తడికమళ్ల యోబు, నాయకులు కంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



