ఫీజుల పెంపును వెనక్కి తీసుకున్న యాజమాన్యం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో సాగిన విద్యార్థుల పోరాటం చారిత్రక విజయాన్ని సాధించింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం (హెచ్పియు) వివిధ కోర్సుల ఫీజులను 25 శాతం పైబడి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ అవిశ్రాంత పోరు సల్ఫింది. బుధవారం కూడా భారీ ర్యాలీ చేపట్టిన వర్శిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. ఫీజుల పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే, 2020-2022లో అప్పటి వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సికందర్ కుమార్ హయాంలో అక్రమంగా జరిగిన 186 ప్రొఫెసర్ల నియామకాలపై విచారణ చేయడానికి కూడా అంగీకరించింది. అయితే తమ డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరే వరకు, క్యాంపస్ నుండి అవినీతి, అక్రమాలు పూర్తిగా నిర్మూలన అయ్యే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ స్పష్టం చేసింది. విద్యార్థుల పోరాటంలో భాగంగా బుధవారం సిమ్లా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం నిర్వహించిన ఆందోళనలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్య అనేది విద్యార్థుల హక్కు అని, ఫీజులు పెంచడం అంటే వారిపై, వారి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పియు విద్యార్థులలో అధిక శాతం మంది మధ్యతరగతి, పేద కుటుంబాల నుండి వచ్చినవారేనని, ఫీజులు పెంపుతో వారి చదువు కష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీ తరువాత ఎస్ఎఫ్ఐ కార్యకర్తల బృందం హెచ్పియు వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ మహావీర్ సింగ్ను కలిసి తమ డిమాండ్లను తెలియజేసింది. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని, ఫైనాన్స్ కమిటీ సమావేశంలో ఫీజుల పెంపు అంశంపై చర్చిస్తామని వైస్-ఛాన్సలర్ ఎస్ఎఫ్ఐ బృందానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపును ఉపసంహరించుకుంటూ, అక్రమాలపై దర్యప్తునకు ఆదేశిస్తామని వర్సటీ యాజమాన్యం ప్రకటించింది.
హిమచల్ వర్సిటీలో ఎస్ఎఫ్ఐ పోరు విజయవంతం
- Advertisement -
- Advertisement -



