నవతెలంగాణ-మద్నూర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల విధ్వంస పాలనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓలకు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజావాణి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డోంగ్లి, మద్నూర్ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే షిండే పాల్గొని ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా ఆందోళన చేపడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ పాలన కొనసాగిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దరఖాస్తు ఫారంలో జతపరుస్తూ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి వై గోవింద్, పార్టీ సీనియర్ నాయకులు మద్నూర్ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకాల విజయ్, నాయకులు కృష్ణ పటేల్, తదితరులు పాల్గొన్నారు.



